జైపూర్ : రాజస్థాన్ కురు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి నలుగురు బాలురు మృత్యువాతపడ్డారు. మృతులంతా 8-15 ఏళ్లల లోపువారేనని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన భలేరి ప్రాంతంలో జరిగిందని పేర్కొన్నారు. పిల్లలు స్నానానికి చెరువు వద్దకు వెళ్లగా.. ఓ బాలుడు నీటిలో పడిపోయాడు. రక్షించేందుకు వెళ్లిన ముగ్గురు సైతం అందులోనే పడిపోయారని తెలిపారు. ఇంటికి దగ్గరగా ఉండడంతో వారంతా స్నానాలు చేసేందుకు చెరువు వద్దకు రాగా.. ఘటన జరిగిన సమయంలో వారి తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో తలమునకలయ్యారు. చెరువు వైపుగా వెళ్లిన పలువురు పిల్లల మృతదేహాలను చూసి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబాలకు అప్పగించారు. ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.