Home Voting | దేశంలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు దశల్లో ఓటింగ్ పూర్తైంది. ఐదో దశ పోలింగ్ మే 20న సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గానికి పలువురు ప్రముఖులు ఇంటి నుంచే ఓటేశారు (Home Voting ).
మాజీ ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh), కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మురళీ మనోహర్ జోషి ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (Chief Electoral Officer) తెలిపారు. ఢిల్లీ లోక్సభ స్థానాలకు ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది.
#LokSabhaElections2024 : Former Vice President Mohammad Hamid Ansari, former Prime Minister, Dr Manmohan Singh and former Union Minister Dr Murli Manohar Joshi avail home voting facility from New Delhi Parliamentary Constituency: Chief Electoral Officer, Delhi
Delhi will vote on… pic.twitter.com/Tbb0d9LUQl
— ANI (@ANI) May 18, 2024
ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. పోలింగ్ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్టుమెంట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను తెస్తారు.
ఇక లోక్సభ ఎన్నికలకు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లోని 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో మూడు స్థానాలకు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఒక్కో స్థానానికి ఐదో దశలో పోలింగ్ జరగనుంది.
Also Read..
Bibhav Kumar | స్వాతి మలివాల్పై దాడి కేసు.. బిభవ్ కుమార్ అరెస్ట్
Deve Gowda | నేరం రుజువైతే ప్రజ్వల్పై చర్యలు తీసుకోండి.. సెక్స్ స్కాండల్ కేసుపై దేవె గౌడ