న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు ఆ పార్టీ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆజాద్ జమ్ము కశ్మీర్ సీఎం అవుతారని మాజీ ఎమ్మెల్యే అమిన్ భట్ శనివారం వ్యాఖ్యానించారు. ఆజాద్తో సమావేశమైన అనంతరం అమిన్ భట్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై తాము చర్చించామని, తాము బీజేపీకి బీ టీం కాదని భట్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ శుక్రవారం ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో సీనియర్లను పక్కనపెడుతున్నారని, రాహుల్ ఆంతరంగికులతో పార్టీ నాశనమవుతోందని ఆజాద్ ప్రస్తావించారు.
రాహుల్ కోటరీ పార్టీని దెబ్బతీస్తున్న తీరును సోనియాకు రాసిన లేఖలో ఆజాద్ వివరించారు. రాహుల్ గాంధీకి పరిణితి లేకపోవడంతో ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం తాను బీజేపీలో చేరడం లేదని, జమ్ము కశ్మీర్లో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఆజాద్ వెల్లడించారు.