ముంబై, ఫిబ్రవరి 18: విల్లు, బాణం గుర్తును ఈసీ ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు కేటాయించడంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రధాని మోదీ బానిస అయిన ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి నిర్ణయం తీసుకొన్నదని ఆరోపించారు. శనివారం తన నివాసం మాతోశ్రీ వద్ద అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. గత 75 ఏండ్లలో ఇలా జరగడం మొదటిసారని, గతంలో కాంగ్రెస్ ఎన్నికల గుర్తును ఇలాగే నిలిపివేసినా, దానిని ఏ పార్టీకి కేటాయించలేదని తెలిపారు. ఇలా చేసినందుకు ఎలక్షన్ కమిషనర్ రిటైరైన తర్వాత గవర్నర్ కావొచ్చేమోనని ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘శివసేన గుర్తును అపహరించారు. దొంగకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే’ అంటూ షిండేను ఉద్దేశించి విమర్శించారు. శివసేన పార్టీ అసలు వారసులెవరో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. త్వరలో జరిగే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
మిత్రపక్ష కూటమికి చెందిన ఉద్ధవ్ఠాక్రేకు చెందిన పార్టీ విల్లు, బాణం గుర్తు కోల్పోవడం ఆ పార్టీపై పెద్ద ప్రభావమేమీ చూపదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ప్రజలు కొత్త గుర్తును తప్పక అంగీకరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఇది ఈసీ నిర్ణయం. ఒకసారి అది తన నిర్ణయాన్ని ప్రకటిస్తే, తర్వాత దానిపై ఎలాంటి చర్చ ఉండదు. కాబట్టి దానిని అంగీకరించి కొత్త గుర్తును తీసుకోవాలి. ప్రజలు కొత్త గుర్తును అంగీకరిస్తే పాత గుర్తు కోల్పోయినా నష్టం పెద్దగా ఉండదు. కాంగ్రెస్ కూడా గతంలో పార్టీ గుర్తులు మార్చిన విషయాన్ని మనం మర్చిపోకూడదు’ అని పేర్కొన్నారు.