బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటకలో లంచాల వ్యవహారం మరోసారి బయటపడింది. దంపతులను లంచాల కోసం అధికారులు వేధిస్తున్నారు. దీంతో భరించలేని ఆ జంట చనిపోయేందుకు తమను అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాగర్ సమీపంలోని కుగ్వే గ్రామానికి చెందిన శ్రీకాంత్ నాయక్, సుజాత నాయక్ దంపతులు, ఖండిక గ్రామ పంచాయితీ పరిధిలోని తమ భూమిలో లేఅవుట్లు వేశారు. భూమిని పాట్లుగా అభివృద్ధి చేశారు. సంబంధిత ఆస్తి పత్రాలు, అనుమతి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
కాగా, లేఅవుట్ను క్లియర్ చేసేందుకు ఆ దంపతులను పంచాయితీ అధికారులు ఐదు లక్షలు లంచం డిమాండ్ చేశారు. తాలూకా అధికారులు కూడా పది లక్షలు లంచం అడిగారు. తమ సమస్యపై డిప్యూటీ కమిషనర్ను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.
దీంతో చేసేదేమీ లేక శ్రీకాంత్, సుజాత నాయక్ దంపతులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. తమ డబ్బులన్నీ లేఅవుట్ కోసం పెట్టినట్లు తెలిపారు. దీంతో అధికారులకు లంచాలు ఇచ్చేందుకు తమ వద్ద చిల్లిగవ్వ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లంచాల కోసం అధికారుల వేధింపులు భరించలేకపోతున్నట్లు ఆ దంపతులు వాపోయారు. మరోదారి లేకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తమ భూమిని ప్రభుత్వం తీసుకుని
చనిపోయేందుకు అనుమతించాలంటూ ఆ లేఖలో కోరారు. ‘మెర్సీ కిల్లింగ్’ అనుమతి కోసం రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖను సాగర్ అసిస్టెంట్ కమిషనర్కు అందజేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారి వారి సమస్యను పరిశీలిస్తామని తెలిపారు.
Fed up of giving #bribes. A couple in #Shivamogga #Karnataka has written to @rashtrapatibhvn seeking permission for #mercykilling. Srikanth Naik & Sujata Naik 4m Kugve village allege local officials are not allowing them 2 develop their property & are demanding bribes #Karnataka pic.twitter.com/e9jMvf80GA
— Imran Khan (@KeypadGuerilla) November 11, 2022