Joshimath | ఉత్తరాఖండ్లోని మరో ఐదు ప్రాంతాల్లో కూడా జోషిమఠ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పౌరి (Pauri), భగేశ్వర్ (Bageshwar), ఉత్తర్కాశీ (Uttarkashi), తెహ్రీ గర్హ్వాల్ (Terhi Garhwal), రుద్రప్రయాగ్ (Rudraprayag) ప్రాంతాల్లోని పలు ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది వారి ఇండ్లను వదిలి వేరే చోటకు వెళ్తున్నారు. పలు చిన్న చిన్న కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరోవైపు… తెహ్రీ జిల్లా నరేంద్రనగర్ నియోజకవర్గంలోని అటాలి గ్రామం వద్ద చేపడుతన్న రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ సొరంగం నిర్మాణ పనులే పగుళ్లకు ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ సొరంగ నిర్మాణం కోసం రాత్రి, పగలు బ్లాస్టింగ్ చేపడుతున్నారని, దీనివల్లనే సమీపంలోని ఇండ్లకు భారీగా పగుళ్లు ఏర్పడుతున్నట్లు చెప్పారు. ఒక్కోసారి రాత్రి సమయంలో ఇండ్లలో ఉండలేక.. స్థానికులు పిల్లలతో సహా రోడ్డుపైకి వస్తున్నారని వాపోతున్నారు.