పట్నా : పడవలో అగ్నిప్రమాదం జరగడంతో బోట్లో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు మరణించిన ఘటన పట్నాలోని రాంపూర్ దియర ఘాట్లో జరిగింది. డీజిల్ క్యాన్లు ఉంచిన ప్రదేశంలో కూలీలు వంట చేసుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బిహార్ పోలీసులు తెలిపారు.
సిలిండర్లు పేలడం వల్ల అగ్నిప్రమాదం జరిగిందని చెబుతున్నా అది వాస్తవం కాదని, డీజిల్ క్యాన్ల వద్ద వంట చేయడం వల్లే ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా నిర్ధారించలేదని అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పడవలో అక్రమ ఇసుకను తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన పడవలో 20 మంది కూలీలు ఉన్నారని, సైట్లో ఇసుక అన్లోడింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.