బెంగళూరు: కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్) పార్టీ అగ్రనేత కుమారస్వామి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై కుమారస్వామి ప్రశంసలు కురిపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు ప్రకటించిందని, ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ఓట్ల కోసం ఈ ఐదు గ్యారంటీల ముచ్చట చెబుతోందని కుమారస్వామి ఎద్దేవా చేశారు.
ఐదు గ్యారంటీలను దేశవ్యాప్తంగా విస్తరించాలని కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతోందని, వాస్తవానికి కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు కర్ణాటకలో పూర్తిగా విఫలమయ్యాయని ఆ రాష్ట్ర మాజీ సీఎం విమర్శించారు. ఐదు గ్యారంటీలు విఫలమవడం మాత్రమే కాదని, ఈ ఐదు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ఐదు గ్యారంటీలతో పేదలకు ఒరిగేదేం లేదన్నారు.
కర్ణాటకలో రెండు గంటలే కరెంటు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారని కుమారస్వామి విమర్శించారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ కేవలం 2 గంటల కరెంటే ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కర్ణాటకలో అమలు కావడం లేదని, అయినా ఆ పార్టీ తెలంగాణలో కూడా అవే హామీలు ఇస్తున్నదని మండిపడ్డారు.
రైతుబంధు కోసం కేసీఆర్ రూ.73 వేల కోట్లిచ్చారు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఎకరానికి రూ.10 వేలు రైతుబంధు ఇస్తున్నారని, ఇప్పటివరకు రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశారని కుమారస్వామి చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని మాయమాటలు చెబుతోందని విమర్శించారు. కాంగ్రెస్కు మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తెలుసని, కాంగ్రెస్ దగాకోరు వైఖరిని, నయవంచనను అందరూ గుర్తించాలని ఆయన కోరారు.
కేసీఆర్ రైతుబంధు పథకాన్ని బీజేపీ కాపీకొట్టింది
కేసీఆర్ రైతుబంధు పథకాన్ని బీజేపీ కాపీ కొట్టిందని కుమారస్వామి ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడి రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నారని, కర్ణాటకలో ఎప్పుడూ సరిగా కరెంటు ఉండటం లేదని విమర్శించారు. కర్ణాటకలో చేయలేని పనులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే దొంగ మాటలను నమ్మవద్దని కోరారు.