న్యూఢిల్లీ : భారత్ వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్ (IIT campus) టాంజానియాలోని జంజిబర్లో రానుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఏంఈఏ) గురువారం వెల్లడించింది. జంజిబర్లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయని పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్, జంజిబర్ అధ్యక్షుడు హుస్సేని అలి మియి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసినట్టు తెలిపింది.
విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ ప్రస్తుతం టాంజానియా పర్యటనలో ఉన్నారు. భారత్ వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్ జంజిబర్లో ఏర్పాటు కానుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్, టాంజానియాల మధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలకు ఈ క్యాంపస్ ప్రతిరూపమని పేర్కొంది.
అత్యధిక సామర్ధ్యం కనబరిచే భారత యూనివర్సిటీలు ఇతర దేశాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని జాతీయ నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో ప్రస్తావించారని ఎంఈఏ గుర్తుచేసింది. ఈ ఏడాది అక్టోబర్లో ప్రోగ్రామ్లను లాంఛ్ చేసేందుకు జంజిబర్లోని ఐఐటీ మద్రాస్ క్యాంపస్ సన్నాహాలు చేపట్టిందని తెలిపింది.
Read More :