న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రజాకర్షక విధానాలను పక్కనపెట్టి సమర్పించిన బడ్జెట్లో కేంద్రం సహజంగానే ద్రవ్యలోటును కట్టడి చేస్తూ ప్రతిపాదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి, 2025-26లో 4.5 శాతం లోపునకు తగ్గిస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు 5.8 శాతానికి పరిమితమవుతుందన్నారు. దీనిని నిరుడు బడ్జెట్లో 5.9 శాతంగా ప్రతిపాదించారు. 2024-25 బడ్జెట్లో నామినల్ జీడీపీ రూ.3.27,71,808 కోట్లుగా బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.
పన్ను వసూళ్లు పెరిగినందున ద్రవ్యలోటును గత బడ్జెట్ అంచనాలకంటే తగ్గించుకోగలుగుతున్నట్టు మంత్రి వివరించారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం) చట్టం మేరకు 2025-26 సంవత్సరానికల్లా ద్రవ్యలోటును 4.5 శాతం లోపునకు తగ్గించాలన్నది ప్రభుత్వం రోడ్మ్యాప్. ఇందుకు అనుగుణంగా 2024-25లో ఇది 5.1 శాతానికి తగ్గుతుందన్న అంచనాల్ని సీతారామన్ ప్రకటించారు. పరిమాణం రీత్యా చూస్తూ 2023-24లో సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుత సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనా 17,34,773 కోట్లుకాగా, వచ్చే ఏడాది రూ. 16,85494 కోట్లకు దిగివస్తుందని తాజా బడ్జెట్లో అంచనా వేశారు. అలాగే రెవిన్యూ లోటు ప్రస్తుత ఏడాది 1.8 శాతానికి, వచ్చే ఏడాది 0.8 శాతానికి తగ్గుతుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.