చట్టవిరుద్ధ యంత్రాంగాలను ప్రజలు ఆశ్రయించే అవకాశాలు ఎక్కువ
వివాదాల సత్వర పరిష్కారం
ఆరోగ్యకర ప్రజాస్వామ్య లక్షణం
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడి
శ్రీనగర్, మే 14: తమ హక్కులు, గౌరవానికి గుర్తింపు, రక్షణ ఉన్నదని ప్రజలు భావించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య ముఖ్య లక్షణమని అన్నారు. న్యాయాన్ని నిరాకరించడం అంతిమంగా అరాచకానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే ప్రజలు చట్ట, న్యాయ విరుద్ధ యంత్రాంగాల వైపు చూస్తారని, తద్వారా న్యాయవ్యవస్థ అస్థిరత చెందుతుందని అన్నారు. శ్రీనగర్లో శనివారం జరిగిన జమ్ముకశ్మీర్ హైకోర్టు కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ మానసిక ఒత్తిడిలో ఉండే కక్షిదారులకు అనుకూలమైన వాతావరణం సృష్టించాలని జడ్జీలు, లాయర్లను కోరారు. భారత్లో న్యాయ పంపిణీ యంత్రాంగం క్లిష్టంగా, ఖర్చుతో కూడుకొని ఉన్నదని విచారం వ్యక్తం చేశారు.
జిల్లా జ్యుడిషియరీ బలంగా ఉండాలి
జిల్లా స్థాయి న్యాయవ్యవస్థే మొత్తం న్యాయవ్యవస్థకు పునాది అని, పునాది బలంగా ఉంటేనే మొత్తం వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. జిల్లా జ్యుడిషియరీలో 20 శాతం పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయని, వీటిని భర్తీ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.