Farooq Abdullah : విపక్ష ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ, కీలక నేతలు దూరమవుతున్న క్రమంలో మరో పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఎన్డీయేలో చేరికపై విస్పష్ట సంకేతాలు పంపారు. ఎన్డీయేలో మళ్లీ నేషనల్ కాన్ఫరెన్స్ చేరిక అవకాశాలను ఆయన తోసిపుచ్చలేదు. దీంతో విపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమని ఫరూక్ అబ్దుల్లా గురువారం స్పష్టం చేశారు. భవిష్యత్లో తమ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే సంకేతాలు పంపారు.
నేషనల్ కాన్ఫరెన్స్ అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, ఏ రాజకీయ పార్టీలతోనూ జట్టు కట్టదని అన్నారు. ఎన్డీయే కూటమిలో చేరే అవకాశాలను ఫరూక్ అబ్దుల్లా తోసిపుచ్చలేదు. అటల్ బిహారి వాజ్పేయి హయాంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా వ్యవహరించింది.
విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలమయ్యాయని అన్నారు. ఇండియా కూటమి, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య గత నెల రోజులుగా విభేదాలు తలెత్తుతున్నాయి. సీట్ల సర్దుబాటును సత్వరమే కొలిక్కి తీసుకురాకుంటే కొన్ని విపక్ష పార్టీలు వేరు కుంపటి పెట్టుకునే అవకాశలున్నాయని గతంలో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల జమ్ము ప్రాంతంలో పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు బీజేపీలో చేరారు.
Read More :
Lovers Suicide | ప్రేమలో కజిన్స్.. ప్రేమికుల దినోత్సవం నాడు సూసైడ్