Lovers Suicide | లక్నో : వారిద్దరు వరుసకు అన్నాచెల్లెలు. కానీ ప్రేమలో పడ్డారు. గత నాలుగేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భావించి, వారిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఫిబ్రవరి 14వ తేదీన వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహోబా జిల్లాలోని చర్ఖరి ఏరియాకు చెందిన సురేంద్ర(22).. వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా సురేంద్ర ప్రేమను అంగీకరించింది. నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్న వారు.. ప్రేమికుల దినోత్సవం నాడు ఆత్మహత్య చేసుకున్నారు.
సురేంద్ర తన పొలంలో పురుగుల మందు సేవించగా, ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా పురుగుల మందు తాగింది. సురేంద్రను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
సురేంద్ర, అతని ప్రియురాలు చిన్నప్పట్నుంచి కలిసి చదువుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాలేజీలో కూడా కలిసి చదువుకున్నారు. అయితే వీరు ప్రేమలో ఉన్నట్లు వారి కుటుంబాలకు తెలియదు. తాను తన కజిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో సురేంద్ర చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.