Cotton Farmers : పత్తి ధరలు పడిపోవడంతో గత ఏడాది నుంచి తాము పత్తిని విక్రయించలేదని మహారాష్ట్రలోని యావత్మాల్ రైతులు వాపోతున్నారు. ఓవైపు రుణాలు చెల్లించాల్సి రావడంతో పంటను ఉంచుకోవాలా లేక నష్టానికి తెగనమ్మాలో నిర్ణయించుకోలేని దుస్ధితిలో ఉన్నామని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతోనే ఈ ఏడాది పత్తి దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు.
తాను 15 ఎకరాల్లో పత్తి సాగుచేశానని నయగావ్ గ్రామానికి చెందిన పత్తి రైతు ప్రకాష్ మధుకర్ గవాండే తన అనుభవాలను వివరించారు. ఎకరానికి రూ. 30,000 పెట్టుబడిపెట్టానని, దాదాపు 70 క్వింటాళ్ల పత్తి పండించానని, రూ. 6000 చొప్పున విక్రయిస్తే తనకు రూ. 7000 నష్టం వస్తుందని వివరించాడు. గత ఏడాదిగా పంటను తాను నిల్వ చేస్తున్నానని, పొడవైన నూలు పత్తి క్వింటాలుకు రూ.7000 పలుకుతుండగా, చిన్న నూలు క్వింటాలుకు రూ. 6000 పలుకుతోందని అన్నారు.
తాను విత్తనాలు, ఎరువులపై రూ. 2.5 లక్షలు ఖర్చు చేశానని, దానిపై 18 శాతం జీఎస్టీ చెల్లించానని గవాండే తెలిపారు. తమ నష్టాలను పూడ్చే స్ధాయిలో ప్రభుత్వ పధకాలు సరిపడినంతగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. పంటను వర్షాలు, గాలుల నుంచి కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నామని గిట్టుబాటు ధర కోసం వేచిచూస్తున్నామని చెప్పారు.
Read More :