Farmers Protest | చండీగఢ్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్ను బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించిన క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఖనౌరి సరిహద్దు వద్ద ఘర్షణల్లో ఒక యువ రైతు మరణించాడు. ఈ క్రమంలో మార్చ్ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు రైతు నేతలు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం నిర్ణయాన్ని వెలువరిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ బుధవారం సాయంత్రం పేర్కొన్నారు. అయితే శంభు, ఖనౌరి సరిహద్దుల్లో ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఎంఎస్పీ విషయంలో కేంద్రం చేసిన ‘ఐదేండ్ల ఒప్పందం’ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ‘ఢిల్లీ చలో’ ఆందోళనను బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభించారు. శంభు, ఖనౌరి సరిహద్దుల నుంచి ఢిల్లీ వైపుగా సాగేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులను అడ్డుకొనేందుకు పోలీసులు రెండు ప్రాంతాల్లో పలు రౌండ్ల బాష్పవాయువు ప్రయోగించారు.
12 మంది పోలీసులకు గాయాలు
ఘర్షణల్లో 12 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని హర్యానా పోలీసులు వెల్లడించారు. భద్రతా సిబ్బందిని చుట్టుముట్టిన ఆందోళనకారులు.. పంట వ్యర్థాలను తగలబెట్టి, అందులో కారం పొడి వేశారని ఆరోపించారు. శంభు, ఖనౌరి సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రైతులు తమ ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, ఇతర వాహనాలతో నిలిచిపోయారు. వీటితోపాటుగా ఆందోళన ప్రాంతాల్లో ఎర్త్ మూవర్లు, పొక్లెయిన్లు, జేసీబీలు మాడిఫైడ్ ట్రాక్టర్లు కూడా కనిపించాయి. వీటితో రైతులు బారికేడ్లను ధ్వంసం చేసేందుకు అవకాశం ఉన్నదని, భద్రతా సిబ్బందికి హాని కలుగుతుందని హర్యానా పోలీసులు పేర్కొన్నారు. మిషనరీని సంబంధిత యజమానులు వెనక్కు తీసుకుపోవాలని, లేకుంటే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
తలకు గాయంతో రైతు మృతి
ఖనౌరి సరిహద్దు వద్ద ఘర్షణలో 21 ఏండ్ల ఒక యువ రైతు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈనెల 13న ఢిల్లీ చలో మార్చ్ ప్రారంభమైన తర్వాత ఘర్షణల్లో ఇదే మొదటి మరణం అని రైతు నేతలు తెలిపారు. ఖనౌరి సరిహద్దు నుంచి గాయపడిన ముగ్గురిని దవాఖానకు తీసుకొచ్చారని, వారిలో ఒకరు మరణించారని పటియాలాలోని రాజింద్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ హెచ్ రేఖి తెలిపారు. మరణించిన వ్యక్తి తలకు గాయమైందని, మిగతా ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నదని పేర్కొన్నారు. పోలీసులు టియర్గ్యాస్తోపాటు రబ్బర్ బులెట్లు కూడా ప్రయోగించారని రైతు నేతలు ఆరోపించారు. రైతు మృతిపై ఎస్కేఎం సంతాపం వ్యక్తం చేసింది. రైతు మరణానికి, ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం సమావేశమై ఆందోళనకు మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నది.
ఢిల్లీ మార్చ్కు అనుమతివ్వాలి
శంభు సరిహద్దు వద్ద రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ ఉద్యయం విజయం సాధించాలంటే శాంతియుతంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. ఆందోళనను దెబ్బతీసే అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచించారు. ఢిల్లీ మార్చ్ శాంతియుతంగానే సాగుతుందని, శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కేంద్రం ఎంఎస్పీపై చట్టం చేస్తే ఆందోళనలు ఉండవని అన్నారు. రైతులు ఢిల్లీకి మార్చ్ చేపట్టేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.
మరోసారి చర్చలకు రండి
కేంద్రం మరోసారి రైతులను చర్చలకు ఆహ్వానించింది. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా.. ఎంఎస్పీతో సహా ఇతర అంశాలపై ఐదో దఫా చర్చలకు రైతులను ఆహ్వానిస్తున్నట్టు బుధవారం వెల్లడించారు. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లపై చర్చించే విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొంటామని పేర్కొన్నారు.
భద్రత కట్టుదిట్టం.. నిలిచిన ట్రాఫిక్
మార్చ్ను బుధవారం తిరిగి ప్రారంభిస్తున్నట్టు రైతులు ప్రకటించిన నేపథ్యంలో ఆందోళకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఢిల్లీ, గుర్గ్రామ్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల రోడ్లను బ్లాక్ చేశారు. దీంతో ఢిల్లీ-గుర్గ్రామ్ హైవే, ఢిల్లీ-బహదూర్గఢ్, రాజోక్రి, సర్హోల్ సరిహద్దుల్లో బుధవారం ఉదయం భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మరోవైపు టిక్రి, సింఘూ, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. నిరంతరం నిఘా ఉంచాలని ఉన్నతాధి కారులు సిబ్బందిని ఆదేశించారు.
యూపీలో రైతుల ఆందోళనలు
మరోవైపు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో యూపీలోని ముజఫర్నగర్, మీరట్, ఘజియాబాద్ సహా పలు జిల్లాల్లో రైతులు బుధవారం ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్లకు మార్చ్ చేపట్టారు. మీరట్ పోలీసుల అడ్డంకులను తొలగించుకొని రైతులు కలెక్టరేట్కు చేరుకొన్నారని మరో బీకేయూ నేత అనురాగ్ చౌదరి తెలిపారు. ఎస్కేఎం పిలుపు మేరకు భగ్పట్లో కూడా రైతులు జిల్లా కేంద్రానికి ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు.
ఆత్మాహుతికి రైతు యత్నం
ముజఫర్నగర్లో బ్రిజ్పాల్ అనే రైతు ఆత్మాహుతికి యత్నించాడు. సకాలంలో మంటలను ఆర్పివేసిన తోటి రైతులు వెంటనే అతన్ని స్థానిక దవాఖానకు తరలించారు. ముఖంపై స్వల్పంగా కాలిన గాయాలయ్యాయని సిటీ మేజిస్ట్రేట్ వికాశ్ కశ్యప్ తెలిపారు. రైతు బ్రిజ్పాల్కు రుణ సంబంధిత సమస్య ఉన్నదని, దాన్ని త్వరలో పరిష్కరిస్తామన్నారు. అయితే బీకేయూ జిల్లా అధ్యక్షుడు యోగేశ్ శర్మ మాట్లాడుతూ బ్రిజ్పాల్ ఎలాంటి రుణం తీసుకోలేదని, అయినప్పటికీ బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో ఆందోళనకు గురయ్యాడని పేర్కొన్నారు. తన సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో బ్రిజ్పాల్ ఆత్మహత్యకు యత్నించారని అన్నారు.
గ్రామాల్లోకి రాజకీయ నేతల్ని రానివ్వం..
ఢిల్లీకి మార్చ్ చేపట్టేందుకు కేంద్రం రైతులను అనుమతించకుంటే.. రైతులు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజకీయ నాయకులను తమ గ్రామాల్లోకి రానివ్వకుండా నిషేధిస్తారని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. ‘రైతుల మార్చ్ను అడ్డుకొనేందుకు రోడ్లపై ఇనుప మేకులు పెట్టడం సరికాదు. వారు అలా చేస్తే.. మేం కూడా గ్రామాల్లో ఆదే చేస్తాం. మా గ్రామాలకు రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తాం’ అని హెచ్చరించారు.