Farmers Protest | తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా రైతులు వచ్చే అవకాశం ఉండడంతో అడ్డుకునేందుకు యూపీ గేట్తో సహా అన్ని ప్రధాన రహదారులపై పోలీసులు బారికేడ్లు వేసి తనిఖీలు చేపడుతున్నారు. దాంతో రాకపోకలపై ప్రభావం పడుతున్నది. దాంతో కూరగాయల సరఫరా తగ్గడంతో పాటు ధరలపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉన్నది. గతంలోనూ రైతులు ఆందోళన చేపట్టిన సమయంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.
మళ్లీ రైతుల ఉద్యమం నేపథ్యంలో ధరలు పెరుగుతాయని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన ఓ కూరగాయల వ్యాపారి వినోద్ మీడియాతో మాట్లాడుతూ ఘాజీపూర్ నుంచి కూరగాయలను కొనుగోలు చేసి తూర్పు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఘాజీపూర్ నుంచి మార్కెట్కు కూరగాయలు తీసుకెళ్లేందుకు ఆటోలకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి వచ్చేదని.. ప్రస్తుతం రూ.500 చెల్లించాల్సి వస్తుందన్నారు. ముందుగా ఆటోలు మార్కెట్కు వచ్చి తిరిగి రావాలంటే సమయం భారీగా పడుతుందని.. అందుకే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మీరట్, ముజఫర్నగర్, హాపూర్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా నుంచి కూరగాయలు ఘాజీపూర్ కూరగాయల మార్కెట్లో అమ్మకానికి వస్తుంటాయి. కానీ, రాకపోకల నేపథ్యంలో ఛార్జీలు పెరుగనుండగా.. కూరగాయల ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నది. సింధు సరిహద్దు ద్వారా హర్యానా నుంచి కూరగాయల సరఫరా ప్రభావితం కానున్నది. ఇక్కడి నుంచి క్యాబేజీ, మిర్చి, పాలకురూ తదితర కూరగాయలు ఢిల్లీ చేరుకుంటాయి. ఢిల్లీ-NCR చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూరగాయలు ఢిల్లీలోని ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్, కేషోపూర్ కూరగాయల మార్కెట్, ఘాజీపూర్ కూరగాయల మార్కెట్కి యమునా ఎక్స్ప్రెస్వే, కాళింది కుంజ్ సరిహద్దు గుండా మార్కెట్కు సరఫరా అవుతాయి. రైతుల ఆందోళన నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉన్నది.