Farmers Protest | న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ రాజధాని ఢిల్లీ మరో భారీ ఆందోళనకు సిద్ధమైంది. బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు బుధవారం ర్యాలీ చేపట్టనున్నారు. ‘మజ్దూర్-కిసాన్ సంఘర్ష్ ( mazdoon kisan sangharsh )’ ర్యాలీ పేరుతో చేపడుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల నుంచి రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్దసంఖ్యలో అద్దె వాహనాలు, రైళ్లు, ఇతర మార్గాల ద్వారా ఢిల్లీకి చేరుకొంటున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, వేతనాల తగ్గుదల తదితర సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని రైతు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వివిధ హామీలతో గద్దెనెక్కిన ప్రధాని మోదీ.. దేశ ప్రజలను ఎనిమిదేండ్లుగా మోసం చేస్తున్నారని రైతు, కార్మిక నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు తాను చెప్తున్న ‘అమృత్కాల్’ కల్పించేందుకు దేనినీ వదలడం లేదని, దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నదని సీఐటీయూ నేత ప్రేమ్నాథ్ రాయ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక సంస్కరణలకు కేంద్రం ఓవైపు ముందుకు వెళ్తుంటే.. మరోవైపు ద్రవ్యోల్బణం సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని యూపీ ఏఐకేఎస్ కార్యదర్శి ముకుత్ సింగ్ దుయ్యబట్టారు.
మజ్దూర్-కిసాన్ సంఘర్ష్ ర్యాలీకి దాదాపు 300 మంది విద్యావేత్తలు, రచయితలు, జర్నలిస్టులు, నటులు, రక్షణ రంగ మాజీ అధికారులు మద్దతు తెలిపారు. కార్పొరేట్ పన్నుల తగ్గింపు, చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టడం, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం, లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల రైటాఫ్, కీలకమైన దేశ వ్యూహాత్మక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇవ్వడం వంటి విధానాలతో కేంద్రం గుడ్డిగా ముందుకు వెళ్తున్నదని, ఇది విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో కుదించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, ఇషితా ముఖోపాధ్యాయ్, మనోరంజన్ మొహంతి, జయతీ ఘోష్, సీపీ చంద్రశేఖర్, హర్ష్ మందర్, నసీరుద్దీన్షా, తీస్తా సీతల్వాడ్, రామకృష్ణ చటర్జీ, విజయ వెంకటరామన్, విశ్వమోహన్ ఝా, అభిషేక్ మహాపాత్ర, మాలిని భాట్టాచార్య, న్యాయవాది అశోక్ అగర్వాల్, మోహన్ సోజ్, సుభాష్ రాయ్, రజిని అరోరా తదితరులు ఉన్నారు.
1. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి.
2. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి.
3. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి.
4. విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.
5. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
6. రోజుకు రూ.600 కూలీతో ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు విస్తరించాలి.
7. పేద రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి.
8. అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలి.
9. నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.
10. కార్మికులందరికీ రూ.10 వేల పింఛను ఇవ్వాలి.
11. కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థకు స్వస్తి పలకాలి.
12. కార్పొరేట్ పన్ను పెంచడంతో పాటు సంపద పన్నును ప్రవేశపెట్టాలి.
13. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి.