న్యూఢిల్లీ, ఆగస్టు 22: తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు చేపట్టిన మహాపంచాయత్లో పాల్గొనడానికి రైతులు పోటెత్తారు. సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్దకు వేల సంఖ్యలో చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే వివిధ రాష్ర్టాల రైతులు జంతర్మంతర్ వద్దకు గుంపులు గుంపులుగా వచ్చారు. అయితే మహాపంచాయత్ను అడ్డుకోవడానికి కేంద్రం రకరకాల ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ నగరంలోనికి రైతుల వాహనాలు రాకుండా పోలీసులతో అడ్డుకుంది. అంతేగాక ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన ఘాజీపూర్, సింఘూ, టిక్రి, నగర శివారుల్లోనూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో జంతర్మంతర్ వద్దకు చేరుకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడ్డారు.
కేంద్రం వెన్నుపోటు
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకూ రైతులు ఉద్యమించిన విషయం తెలిసిందే. అయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పంట రుణాలను మాఫీ చేయాలని, ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, మరణించిన అన్నదాతలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పందించిన కేంద్రం ఏదో నామ్కేవాస్తే ఓ కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నది. ఆగ్రహించిన రైతు సంఘాలు తమ నిరసనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఈ ఉద్యమంలో భాగంగానే తాజాగా మహాపంచాయత్ను నిర్వహిస్తుండగా కేంద్రం తన వక్రబుద్ధిని మళ్లీ ప్రదర్శించింది.
తొలిసారిగా ఎంఎస్పీ కమిటీ సమావేశం
కనీస మద్దతు ధరపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం సోమవారం జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ కీలక సమావేశానికి నీతిఆయోగ్ సభ్యుడు రమేశ్ హాజరుకాలేదు. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ఇప్పటికే రైతు ఐక్య సంఘాల కూటమి సంయుక్త కిసాన్ మోర్చా తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి అగర్వాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జీరో బడ్జెట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పంటమార్పిడి, ఎంఎస్పీని పారదర్శకంగా అమలు చేయడంపై చర్చించారు. అనంతరం కీలకమైన నాలుగు అంశాలపై చర్చించడానికి నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.