న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. రైతు నేత రాకేష్ తికాయత్ ఆదివారం జంతర్ మంతర్కు చేరుకుని మహిళా రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు.
రెజ్లర్లకు అండగా ఉంటామని, వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టే ఆందోళనలో పాలుపంచుకుంటామని పేర్కొన్నారు. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత బ్రిజ్ భూషణ్ అరెస్టులో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన నిలదీశారు.
ప్రధాని మోదీ సర్కార్తో పాటు బ్రిజ్ భూషణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని రైతు నేతలు ప్రకటించారు. మహిళా రెజ్లర్ల ఆందోళనకు అండగా ఉంటామని రైతు నేతలు భరోసా ఇచ్చారు. రాకేష్ తికాయత్తో పాటు దర్శన్ పాల్, హనన్ మొల్లా వంటి పలువురు ఎస్కేఎం నేతలు మహిళా రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు.
Read More