ST Residential Law college | ఉమ్మడి పాలనలో విద్యారంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సంగారెడ్డి జిల్లా నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఎడ్యుకేషన్ హబ్గా మారింది. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమ, ఉన్నత విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యంగా గడిచిన ఎనిమిదేండ్లలో ఎన్నో ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఐఐటీ ఉండగా, దేశంలోనే మొట్టమొదటి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీని గతేడాది మంత్రులు హరీశ్రావు, సత్యవతిరాథోడ్లు ప్రారంభించారు. ఇందులో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీని, నర్సింగ్ కళాశాలను మంజూరు చేసి జిల్లావాసుల దశాబ్దాల కలను నెరవేర్చారు. గత నెల15వ తేదీన వర్చువల్గా తరగతులను ప్రారంభించగా, 35 ఎకరాల్లో రూ.510 కోట్లతో చేట్టిన భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కొత్తగా 50కిపైగా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీల గురుకుల పాఠశాలలు, కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు మనఊరు-మనబడితో ప్రైవేటుకు దీటుగా సర్కారు బడుల్లో అన్ని మౌలిక వసతులు సమకూరుతుండడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ), మే 6
‘అక్షరంతోనే అభివృద్ధి’ అని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి మెరుగులు దిద్దుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ విద్యను చేరువ చేసేందుకు సర్కారు విద్యా సంస్థలను పెంచుతున్నారు. సంగారెడ్డి జిల్లాను విద్యాసౌధంగా మారుస్తూ దేశంలోనే మొట్టమొదటి గిరిజన రెసిన్సియల్ లా కాలేజీని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ రెన్సిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసి ‘సంగారెడ్డి’ని ఎడ్యుకేషన్గా హబ్గా మార్చి ప్రభుత్వ విద్యను పేద విద్యార్థులకు చేరు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి, మే 6 (నమస్తే తెలంగాణ ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంగారెడ్డి జిల్లా విద్యారంగంలో నిర్లక్ష్యానికి గురైంది. జిల్లా ప్రజలు కొత్త డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వాలను డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత సంగారెడ్డి జిల్లా ముఖచిత్రం మారిపోయింది. సంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తూ, ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దారు. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఉన్న విషయాన్ని గుర్తించిన సీఎం మెడికల్ కాలేజీని మంజూరు చేసి, ఇక్కడి ప్రజల కలను నెరవేర్చారు.
దేశంలోనే మొట్టమొదటి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీని సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు కోరిన వెంటనే సంగారెడ్డికి కొత్త కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు మంజూరు చేశారు. మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గానికి గురుకుల పాఠశాలలు, కాలేజీలు మంజూరు చేశారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ విద్యా సంస్థలతో అన్నివర్గాల పిల్లలకు విద్యావకాశాలు మెరుగయ్యాయి. ఆయా విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఫలితంగా జిల్లా ఆర్థిక ప్రమాణాలు, ప్రజల జీవణప్రమాణాలు పెరిగాయి.
దేశంలోనే మొదటి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీ..
సీఎం కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీని సంగారెడ్డికి మంజూరు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఈ కాలేజీని ప్రారంభించి, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును అందజేస్తున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి బీఎల్, ఎల్ఎల్బీ న్యాయశాస్త్ర పట్టాను కాలేజీ అందజేస్తుంది. సంగారెడ్డి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అనుమతి ఇచ్చింది. సంగారెడ్డిలో ఏర్పాటైన గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీ తరగతులు గత ఏడాది మార్చిలో మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ కాలేజీ కొనసాగుతుంది. గిరిజన విద్యార్థులతోపాటు ఇతర సామాజిక వర్గాల వారికి కూడా ఇక్కడ సీట్లు కేటాయిస్తున్నారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు…
సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు కోరిన వెంటనే సర్కారు విద్యా సంస్థలను మంజూరు చేశారు. జిల్లాలో కొత్తగా 50కిపైగా కొత్త బాలుర, బాలికల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం బాలికలు, బడి మధ్యలో మానేసిన బాలికలు, అనాథ బాలికల కోసం కొత్తగా 17 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేసింది. ఇందులో ఏడు కస్తూర్బా గాంధీ బాలికల ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రారంభించింది. 980 మంది బాలికలు ఇంటర్మీడియల్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో కొత్త పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుతో జిల్లాలోని అన్నివర్గాల విద్యార్థులకు విద్యావకాశాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం, స్కాలర్షిప్తో పలువురు ఎస్సీ, మైనార్టీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఇదిలాఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన కళాశాలలకు నూతన భవనాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. సంగారెడ్డిలోని పాలిటెక్నిక్ కాలేజీకి ఇస్మాయిల్ఖాన్పేటలో నూతన భవనాన్ని నిర్మించింది. పాలిటెక్నిక్ కాలేజీలో కొత్తకోర్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలను కాలేజీగా తెలంగాణ ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది.
మెడికల్ కాలేజీ ఏర్పాటుతో తీరిన కల..
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు సంగారెడ్డి ప్రజల ఏండ్లనాటి కల. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు మెడికల్ కాలేజీ అంశాన్ని ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఉపయోగించుకున్నాయి. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్ కాలేజీ మంజూరు చేశారు. మెడికల్ కాలేజీకి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన వద్ద 35ఎకరాల స్థలం కేటాయించారు. కాలేజీ ఏర్పాటు రూ.510 కోట్లు కేటాయించారు.
రూ.35 కోట్లతో ఈ కాలేజీకి తాత్కాలిక భవనాన్ని నిర్మించారు. పూర్తిస్థాయి కళాశాల భవన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి మెడికల్ కాలేజీకి 150 మెడికల్ సీట్లను మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. గతనెల 15న సీఎం కేసీఆర్ సంగారెడ్డి మెడికల్ కాలేజీ తరగతులను వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే ఐఐటీతోపాటు ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఉన్న సంగారెడ్డి ప్రాంతం తాజాగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్గా మారింది.
విద్యాసంస్థ పేరు కేంద్రం
ప్రభుత్వ మెడికల్ కాలేజీ(150 సీట్లు) సంగారెడ్డి
గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీ(60 సీట్లు) సంగారెడ్డి
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ సంగారెడ్డి
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీ సంగారెడ్డి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఇంటర్ కాలేజీ న్యాల్కల్
ఎస్టీ గురుకుల (బాలికల) పాఠశాల సిర్గాపూర్
ఎస్టీ గురుకుల పాఠశాల (బాలుర) కరస్ గుత్తి
ఎస్టీ గురుకుల పాఠశాల (బాలుర) నారాయణఖేడ్
ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కాలేజీ (బాలికల) నారాయణఖేడ్
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ (బాలుర) నారాయణఖేడ్
మినీ గురుకులం (బాలికలు) బాచేపల్లి (నిజాంపేట మండలం)
మహాత్మాజ్యోతిరావు పూలే గురుకులం (బాలుర) పెద్దశంకరంపేట
మైనార్టీ గురుకుల పాఠశాల అల్గోల్ (జహీరాబాద్ మండలం)
మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల కోహీర్
జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల, కాలేజీ ఝరాసంగం
సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మామిడ్గి (న్యాల్కల్ మండలం)
ఎస్టీ గురుకుల పాఠశాల మొగుడంపల్లి
బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు) సదాశివపేట
జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల అందోలు
జ్యోతిరావు పూలే బాలుర రెసిడెన్షియల్ స్కూల్ అందోలు
మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్ (బాలురు) అందోలు
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ (బాలికలు) అందోలు
జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల, కాలేజీ సదాశివపేట
సంగారెడ్డి బాలికల గురుకుల కళాశాల సంగారెడ్డి
మైనార్టీ బాలుర పాఠశాల, కళాశాల సంగారెడ్డి
సంగారెడ్డి బీసీ బాలుర గురుకుల పాఠశాల సంగారెడ్డి
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సంగారెడ్డి
బాలుర రెసిడెన్సియల్ పాఠశాల సంగారెడ్డి
బాలికల మైనార్టీ గురుకల కళాశాల సంగారెడ్డి
మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల ఇస్నాపూర్
మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల పటాన్చెరు
జ్యోతిబా పూలే పాఠశాల బాలికలు ఐనోలుజ్యోతిబా పూలే పాఠశాల బాలురు చిన్న కంజర్ల
గురుకుల కళాశాల (బాలురు) జిన్నారంమోడల్ స్కూల్ వెలిమల (ఆర్సీపురం మండలం)
కస్తూర్బా పూలే కేజీవీబీ పాఠశాల గుమ్మడిదల
ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల పటాన్చెరు