న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. డిడోలి గ్రామానికి చెందిన 65 ఏండ్ల సుశీల్ త్యాగీ బతుకుదెరువు కోసం వచ్చి ఇంద్రపురి కాలనీలో నివసిస్తున్నాడు. గ్రామంలో కొంతమంది సుశీల్ భూమిని ఆక్రమించారు.
ఈ విషయంపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. రక్తంతో రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపాడు. శనివారం ‘సంపూరన్ సమాధాన్ దివస్’ను పురస్కరించుకొని ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని వెళ్లిన సుశీల్ ఉన్నతాధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సమక్షంలో సుశీల్ త్యాగీ హఠాత్తుగా తన చేయి కోసుకొన్నాడు. మీరట్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సుశీల్ త్యాగీ చనిపోయాడు.