న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికులు అన్ని వేళలా, అన్ని చోట్ల శానిటైజేషన్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలాగే కరోనా నియంత్రణకు సంబంధించిన నియమ, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని విమానయాన సంస్థలకు సూచించింది. దీనిని పాటిస్తున్నారో లేదో అనేది పరిశీలించేందుకు ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని డీజీసీఏ పేర్కొంది. కరోనా నియంత్రణ నియమాలు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ మేరకు విమానయాన సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. ఆగస్ట్ 1 నుంచి కరోనాతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. గత 15 రోజుల్లో కరోనా కేసులు రెండు రెట్లు పెరిగాయి. ఐసీయూలో చేరే కరోనా రోగుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది. గత శనివారం నుంచి ప్రతి రోజూ ఐదు కరోనా మరణాలు నమోదవుతున్నాయి. వాణిజ్య రాజధాని ముంబైలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆగస్ట్ 16న ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు కేటాయించిన ఐసీయూ బెడ్లు నిండుకున్నాయి.