న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్(Jaishankar) అన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న దాడి అంశంపై ఆయన ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు చర్చలు, సంప్రదింపులు నిర్వహించాలని తాము విశ్వసిస్తామని, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని మంత్రి జయశంకర్ అన్నారు. సంక్షోభం మొదలైన నాటి నుంచి పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఎప్పటికప్పడు అంచనా వేస్తున్నామని, ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇరాన్లో వేలాది మంది భారతీయులు ఉన్నారని, కొందరు చదువు కోసం వెళ్లగా, మరికొందరు ఉద్యోగం కోసం వెళ్లినట్లు తెలిపారు. మన దేశ ఇంధన భద్రతకు ఆ ప్రాంతం చాలా కీలకమైందని, ఆయిల్.. గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీలు ఉన్నాయన్నారు. ఇరాన్కు అత్యవసరం కానటువంటి పర్యటన చేయవద్దు అని భారతీయులకు సలహా ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
VIDEO | Delhi: External Affairs Minister S Jaishankar (@DrSJaishankar) addresses the Rajya Sabha on the West Asia conflict, saying, “While attempts have been made, contacts with Iran at the leadership level are obviously difficult at this time. I have, however, spoken to Foreign… pic.twitter.com/fvyJxmdlG2
— Press Trust of India (@PTI_News) March 9, 2026
ఇరాన్ నాయకులతో గతంలో సంప్రదించామని, కానీ ఈ దశలో చాలా కష్టంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. అయినా కానీ ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాకచితో మాట్లాడానని, ఆ తర్వాత మార్చి 5వ తేదీన కూడా చర్చించినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ ఇరాన్తో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరపనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొచ్చిలో ఉన్న ఇరాన్ నౌక గురించి కూడా సభలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. చమురు మార్కెట్ను అంచనా వేసి, దాని ప్రకారమే భారతీయులకు ఇంధన భద్రత కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. భారతీయ కస్టమర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.