న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించకూడదన్నది మన సంప్రదాయమని, దేశంలోని చివరి వ్యక్తి వరకూ ఆహార ధాన్యాలను చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈశ్రమ్ పోర్టల్లో నమోదైన వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల తాజా జాబితాను తమకు అందించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ప్రతి ఒక్కరికి ఆహారధాన్యాలు అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని పేర్కొంది.
కొవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఆహారధాన్యాలు అందేలా చర్యలు తీసుకున్నదని తెలిపింది. అయితే ఈ చర్యలు కొనసాగాలని పేర్కొంది. ఎవరూ ఆకలితో నిద్రించకుండా చూడాలన్నది మన సంప్రదాయమని వ్యాఖ్యానించింది. కొవిడ్ మహమ్మారి, దాని ఫలితంగా విధించిన లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు ఎదుర్కొన్న స్థితిగతులకు సంబంధించి ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్, హర్ష్ మందర్, జగదీప్ ఛోకర్ల పక్షాన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. 2011 జనగణన తరువాత దేశ జనాభా పెరిగిందని, అదే సమయంలో ఎన్ఎఫ్ఎస్ఏ కింద లబ్ధి పొందే లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. అయితే ఎన్ఎఫ్ఎస్ఏను సక్రమంగా అమలు చేయలేకపోతే ఎంతో మంది అర్హులు, లబ్ధిదారులు ఆహార భద్రత ప్రయోజనాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. దేశంలో తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం చెప్తున్నదని, కానీ ప్రపంచ ఆకలి సూచిలో భారత్ కిందికి జారిపోయిందని పేర్కొన్నారు. తమ రాష్ర్టాల్లో ఆహార ధాన్యాల నిల్వలు తరిగిపోయాయని 14 రాష్ర్టాలు అఫిడవిట్లు దాఖలు చేశాయని తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ గురువారం కొనసాగనుంది.