న్యూఢిల్లీ, జనవరి 18: ఈ ఏడాది తొమ్మిది రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు జరుగనుండగా కేంద్ర ఎన్నికల సంఘం తొలి నగారా మోగించింది. ఈశాన్య భారతంలోని త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది. త్రిపురకు ఫిబ్రవరి 16, నాగాలాండ్, మేఘాలయలో అదే నెల 27న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజున ఒక లోక్సభ, ఆరు అసెంబ్లీ సీట్లకు కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలతోపాటు ఈ మూడు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ బుధవారం మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది తొమ్మిది రాష్ర్టాల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికలు కీలకం కానున్నాయి. త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఇతర ఈశాన్య రాష్ర్టాలలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని బీజేపీ చూస్తున్నది. త్రిపురను సుదీర్ఘకాలం పాలించిన వామపక్షాలు తిరిగి పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నాయి. త్రిపురలో ఈసారి వామపక్షాలు కాంగ్రెస్తో కలిసి పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగాలాండ్, మేఘాలయ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నది.
ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు
మూడు ఈశాన్య రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్తోపాటే దేశంలో ఖాళీగా ఉన్న ఒక లోక్సభ, ఆరు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. లక్షద్వీప్ లోక్సభ స్థానంతోపాటు ఐదు రాష్ర్టాల్లోని ఆరు శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్కుమార్ వెల్లడించారు. క్రిమినల్ కేసులో దోషిగా ఖరారైనందున ఎన్సీపీ ఎంపీ మొహమ్మద్ ఫైజల్పై అనర్హత వేటుపడటంతో లక్షద్వీప్ లోక్సభ స్థానం ఖాళీ అయింది.