(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 15, (నమస్తే తెలంగాణ): లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? అక్టోబర్లో లోక్సభ రద్దు కానున్నదా? ఈ డిసెంబర్, వచ్చే జనవరిలో 5 రాష్ర్టాలకు జరుగాల్సిన ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించనున్నారా? వీటితోపాటే జమ్ము-కశ్మీర్కు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా?.. ఢిల్లీ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్న ప్రచారమిది. గడువు ప్రకారం వచ్చే ఏడాది మేలో లోక్సభకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఆ లోపే ముందస్తు ఎన్నికలకు వెళ్లే దిశగా కేంద్రంలో బీజేపీ సర్కార్ యోచిస్తున్నట్టు ఆ వర్గాల కథనం. ఇదే జరిగితే మేలో జరుగాల్సిన సార్వత్రిక ఎన్నికలు నాలుగు నెలలముందే జనవరిలో జరిగే అవకాశం ఉందంటున్నారు. జమిలి ఎన్నికలకు ‘నో’ చెప్పాక ముందస్తు ఎన్నికలకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జోరందుకున్నది. ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపడానికి కేంద్రానికి బలమైన కారణాలే ఉన్నాయని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతోపాటు జనవరిలో మిజోరంకు గడువు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరుగాల్సి ఉంది. వీటిని కూడా సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహిస్తారని ఈ వర్గాల సమాచారం. వీటితోపాటు జమ్ముకశ్మీర్ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనావేస్తున్నాయి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది. దీనిని కూడా కలిపితే ఆరు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరపాలన్నది బీజేపీ ఆలోచనగా ఆ వర్గాలు అంటున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారానికి ఇటీవల వివిధ సందర్భాలలో ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత, బీహార్ సీఎం నితీశ్చేసిన వ్యా ఖ్యలు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీపాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సమావేశమైన సందర్భంగా ముందస్తు ఎన్నికలపై వారితో ప్రధాని మోదీ చర్చించినట్టు తెలిసింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలంటూ మోదీ వారికి హింట్ ఇచ్చినట్టు సమాచారం. గతనెల బీహార్ సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలో పాట్నాలో విపక్షాల భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తనకు సమాచారం ఉందని నితీశ్కుమార్ వెల్లడించారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ జనవరికల్లా పూర్తి కావాలని అధికారులను ఆదేశించడం కూడా ముందస్తు ఎన్నికలపై ఆమెకు సమాచారం ఉండటం వల్లనే అయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
లోక్సభ ఎన్నికలకు ఇంకా 9 నెలల గడువు (మే 2024) ఉన్నప్పటికీ విపక్ష పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ‘ఇండియా’ పేరుతో కూటమి కట్టి.. ఇప్పటికే పాట్నా, బెంగళూర్లో సమావేశమయ్యాయి. సెప్టెంబర్లో ముంబైలో సమావేశం కానున్నట్టు ప్రకటించాయి. అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి రెండింటికీ సమదూరం పాటిస్తున్న భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. తెలంగాణలోనే కాకుండా బీఆర్ఎస్కు మహారాష్ట్రలోనూ అన్నివర్గాల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. అటు ‘ఇండియా’ కూటమి, ఇటు బీఆర్ఎస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలపడే అవకాశం లేకపోలేదని బీజేపీ అంచనా వేస్తున్నది. ఇప్పటికే కర్ణాటక ఎన్నికలను ప్రధాని మోదీ తన భుజాన వేసుకొని రోజుల తరబడి ప్రచారం చేసినా.. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఘోర పరాజయం తప్పలేదు. అలాగే లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపీకి వ్యతిరేక ఫలితాలే వస్తే మేలో జరిగే లోక్సభ ఎన్నికలపై వాటి ప్రభావం ఉంటుందని ఆ పార్టీ ఆందోళన చెందుతున్నది. ప్రతిపక్షాలు బలపడకముందే ఈ ఏడాది చివర్లో లోక్సభ ఎన్నికలకు వెళ్లడమే మంచిదని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం.
కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత మెజార్టీ సీట్లు లభించడంతో ఎన్డీయే పక్షాలను అసలు ఖాతరు చేయలేదు. పైగా వాటిని చీల్చి తన బలాన్ని మరింత పెంచుకోవడానికి స్నేహధర్మానికి కూడా ద్రోహం చేసింది. ఫలితంగా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం నితీశ్కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. రైతువ్యతిరేక సాగు చట్టాలను నిరసిస్తూ అకాలీదళ్ కూడా ఎన్డీయేకు దూరమైంది. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ పార్టీని నిలువునా చీల్చి ఏక్నాథ్ షిండేను బీజేపీ అక్కున చేర్చుకున్నది. దీంతో ఉద్ధవ్థాక్రే నేతృత్వంలోని శివసేనను బీజేపీ శాశ్వతంగా దూరం చేసుకుంది. అలాగే అక్కడ శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోనూ చిచ్చు పెట్టి అజిత్పవార్ను చేరదీసింది. మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ కారణాలతో ఎన్డీయే భాగస్వామ్యం పక్షాలు దాదాపు కొన్ని శాశ్వతంగా దూరంకాగా మరికొన్ని అంటీముట్టనట్టు వ్యవహరించాయి. వచ్చే ఎన్నికలలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం అంత సులభం కాదన్న వార్తల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో తమ పాత మిత్రులతో బీజేపీ పెద్దలు సమావేశమైన విషయం తెలిసిందే. విపక్షాల కూటమిలో 26 పార్టీలు ఉండటంతో తమకు అంతకంటే ఎక్కువ పార్టీల మద్దతే ఉందని చాటుకోవడానికి 38 పార్టీలను ఈ భేటీకి ఆహ్వానించింది. వాస్తవానికి హాజరైన 38 పక్షాలు పేరుకు మాత్రమే. అందులో 8 పార్టీలకు కలిపి 9 మంది ఎంపీలే ఉండగా, 18 పార్టీలకు అసలు లోక్సభలో ప్రాతినిధ్యమే లేదు. మరికొన్ని పార్టీలకు అయితే ఎన్నికల కమిషన్లో రిజిస్ట్రేషన్ తప్ప గుర్తింపే లేదు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు రోజురోజుకు సన్నగల్లుతుండటంతో ముందస్తుకు వెళ్లయినా పరాజయ గండం నుంచి బయటపడవచ్చని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతున్నది.
కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని పదేండ్ల పాలనపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత తీవ్రమవుతున్నది. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణం, కేంద్రప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ వ్యతిరేకత, కర్ణాటకలో ఓటమి తాజాగా మణిపూర్ ఘటన తదితర కారణాలతో ప్రధాని మోదీ ప్రతిష్ట మసకబారింది. ఆయన గ్రాఫ్ కూడా రోజురోజుకూ పడిపోతున్నట్టు అనేక సర్వేల్లో వెల్లడైంది. సీ-ఓటర్, ఇండియాటుడే సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. గతానికంటే బీజేపీకి, ఎన్డీయే పక్షాలకు సీట్లు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే విపక్షాలకు సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. సర్వే సంస్థలు కాకుండా బీజేపీ సొంతంగా నిర్వహించుకునే అంతర్గత సర్వేల్లోనూ గతానికంటే ఈ సారి వంద సీట్లలో ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదని తేలినట్టు సమాచారం. మరోవైపు ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతున్న క్రమంలో పార్టీలో అసమ్మతి నేతలు గడ్కరీ, రాజ్నాథ్సింగ్, యోగీ, సంఘ్ పరివార్ స్వరంలోనూ మార్పు కనిపిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది మరింత బలపడితే తన ప్రధాని అభ్యర్థిత్వానికి కూడా ముప్పేనన్న భయం కూడా మోదీని ముందస్తు వైపు మొగ్గు చూపేందుకు కారణమై ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.