కాంగ్రెస్కు ఎలాంటి పీకేలూ అవసరం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోమారు వ్యాఖ్యానించారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడగలదని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ గురువారం ఓ జాతీయ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు తన అవసరం లేదని, సొంతంగానే తిరిగి నిలబడగలదని పేర్కొన్నారు.
భవిష్యత్ ప్రణాళికలపై తనకూ, కాంగ్రెస్కు మధ్య ఓ అవగాహన వచ్చిందన్నారు. ఆ ప్రణాళికలన్నింటినీ కాంగ్రెస్సే సొంతంగా చేసుకోగలదని, అందులో కూడా చాలా సమర్థవంతమైన, పెద్ద నేతలే వున్నారని ఆయన పేర్కొన్నారు. తనను కాంగ్రెస్లో చేరాలని అడిగారని, అందుకు తాను తిరస్కరించానని పీకే స్పష్టం చేశారు.
2014 తర్వాత ఓ పద్ధతి ప్రకారం తన భవిష్యత్ ప్రణాళికల గురించి కాంగ్రెస్ చర్చించడం తాను మొదటి సారిగా చూస్తున్నానని, తానేం చెప్పాలనుకున్నానో, అన్నీ కాంగ్రెస్ అధినేత్రి ముందు ఉంచానని పీకే వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సోనియా ఏర్పాటు చేసిన సాధికారత కమిటీలో తనను చేరమని అన్నారని, కానీ ఆ కమిటీపై తనకు కొన్ని సందేహాలున్నాయని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ అనుభవిస్తున్న హోదాను తాను అడిగినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పీకే స్పష్టం చేశారు. రాహుల్ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. బీజేపీ రాహుల్ విషయంలో చిత్రించిన చిత్రీకరణను, కాంగ్రెస్ తుడిచివేయవచ్చని పీకే పేర్కొన్నారు.