Assembly elections 2022 : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్లో వ్యాక్సిన్ తొలి డోసు తక్కువ శాతం నమోదవడం పట్ల ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు ఈసీ అధికారులు ఇటీవల పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో పర్యటించారు.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నిబంధనలను కఠినంగా అమలుచేస్తూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీలు ర్యాలీలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని పలువరు వైద్య నిపుణులు ప్రభుత్వంతో పాటు ఈసీకి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాలను సందర్శించిన సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఆయా రాష్ట్రాల అధికారులతో క్షేత్రస్ధాయి అంశాలపై చర్చలు జరిపారు. ఇక కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకూ 1700 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.