ముంబై: ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ప్రజల ద్వారానే దానిని ఎన్నుకోవాలని అన్నారు. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును షిండే వర్గానికి ఈసీ కేటాయించడంపై ఆయన మరోసారి మండిపడ్డారు. సోమవారం మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ఒక అధికార పార్టీ పేరు, చిహ్నాన్ని నేరుగా ఒక వర్గానికి ఇచ్చిన సందర్భం ఇప్పటి వరకు లేదన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉండగా ఈసీ తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాముడి ధనుస్సును రావణుడు పట్టుకోలేడంటూ పరోక్షంగా షిండే వర్గంపై మండిపడ్డారు.
కాగా, మీరంతా ఇక్కడకు ఎందుకు వచ్చారు? అని రిపోర్టర్లను ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. తన దగ్గర ఏమీ లేవని, తన నుంచి అన్నీ దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవతలి వర్గం శివసేన పేరు, గుర్తు తీసుకున్నప్పటికీ ఠాక్రే పేరు తీసుకోలేరని ఉద్వేగంతో అన్నారు. ‘ బాలాసాహెబ్ ఠాక్రే కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. కేంద్రం సహాయంతో వారు దానిని పొందలేరు’ అని వ్యాఖ్యానించారు. దొంగలు తన ఇంట్లోకి చొరబడి అన్నీ దోచుకున్నారంటూ షిండే వర్గాన్ని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. శివసేన పేరు, గుర్తును షిండే వర్గానికి ఈసీ కేటాయించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని విమర్శించారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీష్ కుమార్, ఇంకా అనేక మంది తనకు మద్దతుగా ఫోన్ కాల్స్ చేసి మాట్లాడినట్లు తెలిపారు. ‘ఈ రోజు బీజేపీ మాకు ఏం చేసిందో, రేపు ఎవరితోనైనా ఇలాగే చేయవచ్చు. ఇదే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. నియంతృత్వం నగ్నంగా నృత్యం చేస్తుంది’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
హిందుత్వాన్ని తాను ఎప్పటికీ విడిచిపెట్టలేదన్న ఉద్ధవ్ ఠాక్రే, హిందువు ఎవరో ఇప్పుడు మాట్లాడాలి అని అన్నారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం నుంచి విచారణ ప్రారంభిస్తుందని వెల్లడించారు.