ECI : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల పారితోషికాలు (Remunerations), గౌరవభృతి (Honorarium) ని సవరించింది. 2015 తర్వాత ఈసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల పారితోషికాలను సవరించడం ఇదే తొలిసారి. తాజా సవరణ ప్రకారం బూత్ లెవల్ అధికారుల (BLOs) పారితోషికాన్ని ఈసీ ఏకంగా రెండింతలు చేసింది. 2015 నుంచి ఇప్పటివరకు బూత్ లెవల్ అధికారులకు పారితోషికంగా రూ.6 వేలు ఇస్తుండగా ఇప్పుడు దాన్ని రూ.12 వేలు చేసింది.
అదేవిధంగా ఓటర్ల జాబితాను సరిచూసినందుకు బీఎల్వోలకు గతంలో రూ.1000 ఇన్సెంటివ్గా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఇన్సెంటివ్ను రూ.2 వేలకు పెంచారు. ఇక బీఎల్వో సూపర్వైజర్లకు గతంలో రూ.12 వేలు పారితోషికంగా ఇస్తుండగా ఇప్పుడు దాన్ని రూ.18 వేలు చేశారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (EROs) కు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (AEROs) కు గతంలో ఎలాంటి గౌరవభృతి ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఈఆర్వోలకు రూ.25 వేలు, ఏఈఆర్వోలకు రూ.30 వేలు గౌరవభృతి ఇవ్వనున్నారు.
అదేవిధంగా బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జరిగిన ఓటర్ల జాబితా అత్యవసర సవరణ కోసం పనిచేసిన బూత్ లెవల్ అధికారులకు కూడా ఎన్నికల సంఘం రూ.6 వేలు ప్రత్యేక ఇన్సెంటివ్గా ప్రకటించింది.