కోల్కతా : పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. రెండో, ఆఖరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు చివరి వరకు ప్రయత్నించారు. ఎన్నికలు నిర్వహిస్తున్న 142 నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాయి.
ఎన్నికలు జరుగుతున్న కీలక జిల్లాల్లో బీజేపీ చేపట్టిన ర్యాలీల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. మరోవైపు అధికార తృణమూల్ గెలుపు కోసం సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఓటర్లను నేరుగా కలుసుకోవటంతో సహా, క్షేత్రస్థాయి ప్రచారాన్ని కొనసాగించారు. మమత పాలన, రాష్ట్రలో శాంతి భద్రతలు, గుర్తింపు సమస్యలను ప్రస్తావిస్తూ అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు.