Eknath Shinde : కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షిండే సారధ్యంలోని శివసేనలో చేరనుండటంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. మిలింద్ దేవరా శివసేనలో చేరాలని నిర్ణయించుకుంటే తాను స్వాగతిస్తానని స్పష్టం చేశారు.
మిలింద్ దేవరా వ్యవహారం తాను విన్నానని, ఆయన తమ పార్టీలో చేరితే స్వాగతిస్తానని షిండే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత, దక్షిణ ముంబై మాజీ ఎంపీ మిలింద్ దేవరా ఆదివారం ఉదయం ప్రకటించారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన మధ్య లోక్సభ సీట్ల సర్ధుబాటు చర్చల పట్ల అసంతృప్తితో మిలింద్ దేవరా కాంగ్రెస్ను వీడారని చెబుతున్నారు.
కాగా, ప్రస్తుత రాజకీయాలు అధికారం చుట్టూ తిరుగుతున్నాయని, సిద్ధాంతం, విలువలు, విశ్వాసానికి చోటు లేదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. మిలింద్ తండ్రి మురళి దియోర దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని, అధికార దాహంతోనే మిలింద్ దియోర శివసేన షిండే వర్గంలో చేరుతున్నారని దుయ్యబట్టారు.
Read More :