Sanjay Raut : ప్రస్తుత రాజకీయాలు అధికారం చుట్టూ తిరుగుతున్నాయని, సిద్ధాంతం, విలువలు, విశ్వాసానికి చోటు లేదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. మిలింద్ తండ్రి మురళి దియోర దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని, అధికార దాహంతోనే మిలింద్ దియోర శివసేన షిండే వర్గంలో చేరుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో విలువలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత మురళి దియోర కుమారుడు మిలింద్ దియోర (Milind Deora) కాంగ్రెస్కు రాజీనామా చేశారు. పార్టీతో తమ కుటుంబానికి 55 ఏండ్ల అనుబంధం ముగిసిపోయిందని, తన రాజకీయ చరిత్రలో కీలక అధ్యాయానికి తెరపడిందని మిలింద్ దియోర వెల్లడించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
తనకు సహకరించిన పార్టీ నేతలు, సహచరులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్విట్టర్ వేదికగా మిలింద్ దియోర తెలిపారు. అభివృద్ధి రాజకీయాల దిశగా తన తదుపరి అడుగులు ఉంటాయని చెప్పారు. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన మద్దతు దారులతో సంప్రదించిన అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని, ఈ దిశగా ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
Read More :