ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు రౌత్ తరఫున లాయర్లు ముంబైలో ఈడీ అధికారులను కలిసి సమన్లకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆగస్ట్ మొదటి వరకు సమయం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న క్రమంలో విచారణకు రాలేదని న్యాయవాదులు ముంబై జోనల్ కార్యాలయంలో అధికారులను కలిసి వివరించారు.
ఈ మేరకు ఎంపీకి వారం గడువు ఇస్తూ.. ఈ నెల 27న విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్షలతోనే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 1న ఈడీ విచారించింది. పీఎంఎల్ఏ చట్టం కింద పదిగంటల పాటు ప్రశ్నించింది. ముంబైలోని గోరెగావ్ పాత్రచాల్ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ భార్యతో పాటు స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.