న్యూఢిల్లీ: విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు, ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో సోదాలు, అరెస్టులు నిర్వహించడం, సమన్లు జారీచేయడం వంటి చర్యలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పాల్పడినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఈడీ దాడులు ప్రత్యేకంగా ఎన్నికలు జరిగే విపక్ష పాలిత రాష్ర్టాలపైనే కేంద్రీకృతం అయి ఉన్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనంలో పేర్కొన్నది.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బెంగాల్లో గత రెండు నెలల కాలంలో వివిధ కేసులకు సంబంధించి సోదాలు, అరెస్టులు, ఆస్తుల జప్తు, ఇంటరాగేషన్లు వంటి సుమారు 20 కార్యకలాపాలను ఈడీ నిర్వహించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 19 మధ్య కేవలం 23 రోజుల కాలంలో బెంగాల్ వ్యాప్తంగా ఆరు నగరాలలోని 50కి పైగా ప్రాంగణాలకు సంబంధించి 8 సోదా కార్యకలాపాలను ఈడీ నిర్వహించింది.
ఎన్నికలు జరిగిన కేరళలో కూడా జనవరిలో ఈడీ సోదాలు నిర్వహించింది. శబరిమలకు సంబంధించిన బంగారు ఆభరణాల దుర్వినియోగం కేసులో 21 ప్రాంతాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు జరిపింది. అదే విధంగా తమిళనాడులో,మరో ప్రతిపక్ష పాలిత రాష్ట్రమైన పంజాబ్లో కూడా ఏప్రిల్ 15న 10కి పైగా ప్రదేశాలలో ఈడీ దాడులు జరిపింది.