చెన్నై, ఫిబ్రవరి 19: మన దేశంలో పండే పండ్లు, కూరగాయల్లో దాదాపు 40 శాతం మేర వృథాగా కుళ్లిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతులకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం. ఉన్నా ఆ ఖర్చును రైతులు భరించలేకపోవడం. ఈ విషయాన్ని తెలుసుకున్న చెన్నైకు చెందిన దీపక్ రాజ్మోహన్(29) ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. ఇందుకోసం అమెరికాలో మంచి ఉద్యోగాన్ని సైతం వదులుకొని కర్ణాటకలోని గ్రామాల్లో తిరిగారు. సమస్యను అర్థం చేసుకున్నాడు. పరిష్కారాన్ని వెతికేందుకు మూడు నెలల పాటు పరిశోధనలు చేసిన తర్వాత 2020 మేలో విజయ్ ఆనంద్ అనే మరొకరితో కలిసి గ్రీన్ పాడ్ ల్యాబ్స్ను స్థాపించారు.
ఎకో ఫ్రెండ్లీ సాచెట్లు
మొక్కల సహజ సారం ద్వారా వీరు ఓ పద్ధతిని కనుగొన్నారు. పర్యావరణ అనుకూలమైన సాచెట్లను తీసుకువచ్చారు. ఇవి పండ్లు, కూరగాయలు పాడవకుండా వాటిలో ఉండే సహజ గుణాన్ని మరింత పెంచుతాయి. పండ్లు, కూరగాయల షెల్ఫ్ లైఫ్ను పొడిగించడంతో పాటు వాటిలో సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. ఈ సాచెట్లను పండ్లు, కూరగాయలలో ఉంచితే చాలు. ఫ్రిడ్జ్ లేకున్నా పాడవవని, వాటి జీవితకాలం పెరుగుతుందని, తాజాగా ఉంటాయని దీపక్, విజయ్ చెప్తున్నారు. కిలో మామిడి పండ్లకు రూ.5 సాచెట్, కిలో క్యాప్సికంకు రూ.4 సాచెట్, కిలో టమాటోకు రూ.1.25 సాచెట్ ఉపయోగించవచ్చని తెలిపారు.