Modi Vs Congress | ఇటీవల కాంగ్రెస్నుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బృందం సోమవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మేనిఫెస్టో, ముస్లిం లీగ్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో సహా పలు అంశాలపై పవన్ ఖేడా, సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ ప్రధాని తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయన్నారు. మేనిఫెస్టోపై ఆయన అబద్ధాలు చెప్పారని, దాంతో కలత చెందామన్నారు.
అయితే, ఇతర పార్టీల మేనిఫెస్టోను విభేదించలేరని.. కేవలం చర్చించడంతో పాటు విశ్లేషణ చేయొచ్చన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ జాడలు ఎక్కడ కనిపించాయని ఆయన ప్రశ్నించారు. తమది జాతీయ పార్టీ అని.. ప్రధాని మోదీ పార్టీ చేయని స్వాతంత్య్ర పోరాటంలో తాము పాల్గొన్నామని.. తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. పవన్ ఖేడా మాట్లాడుతూ ప్రధాని వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ముందుంచామని.. చర్యలు తీసుకోవాలని విన్నవించామన్నారు. ఈసీ ఎదుట అనేక అంశాలను లేవనెత్తినట్లు తెలిపారు. తమ మేనిఫెస్టోకు ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు. అలాగే, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ప్రధాని హోర్డింగ్లపై అభిప్రాయాలు వ్యక్తం చేశామన్నారు.
బీజేపీ త్రివేండ్రం ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్కు సంబంధించి సైతం అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలిపారు. అఫిడవిట్లో చాలా తప్పులున్నాయని.. ఉద్దేశపూర్వకంగానే తప్పులు దొర్లాయన్నారు. ఇదిలా ఉండగా.. యూపీలోని సహరన్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందన్నారు. మిగతా మిగిలిన భాగాన్ని వామపక్షాల ఆలోచనలు ఆక్రమించాయన్న ఆయన.. కాంగ్రెస్ మేనిఫెస్టోను ‘అబద్ధాల పుట్ట’గా అభివర్ణించారు. అందులోని ప్రతి పేజీ లక్ష్యం భారతదేశాన్ని ముక్కలు చేయడమేనని విమర్శించారు.