న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది. మంగళవారం మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది. ఢిల్లీ 7వ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15తో ముగియనుంది. ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. దీంతో నెల రోజుల ముందుగానే ఎన్నికల ప్రక్రియను ఈసీ మొదలు పెట్టనుంది.
ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలున్నాయి. అధికారం నిలుపుకోవాలని ఆప్, ఈసారైనా ఢిల్లీ గద్దెనెక్కెలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనే హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, గత రెండు పర్యాయాలు కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఘన విజయం సాధించింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఆప్ ఖరారు చేసింది. న్యూఢిల్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరిలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి అతిశీ మరోసారి కల్కాజీ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. న్యూ ఢిల్లీలో కేజ్రీవాల్పై మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను పోటీగా నిలిపింది. ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్కు తొలి జాబితాలో చోటు దక్కింది. ఆయన్ని బిజ్వాసన్ స్థానం నుంచి పోటీకి దింపింది. కాగా, త్రిముఖ పోటీలో కాంగ్రెస్ కూడా విజయం కోసం పాకులాడుతున్నది. మహిళలా ఓటర్లను ఆకట్టుకునేందుకు నెలకు రూ.2500 ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నది.
#DelhiElection2025 | Election Commission of India to announce the schedule for the General Election to the Delhi Legislative Assembly today at 2 pm. pic.twitter.com/PZ2fTBcMpt
— ANI (@ANI) January 7, 2025