న్యూఢిల్లీ: గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కర్ణాటకలో ఎన్నికల తాయిలాలు వరదలా పారాయి. దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు రూ.375 కోట్ల విలువైన మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న వాటితో పోలిస్తే ఈసారి పట్టుకున్నవి 4.5 రెట్లు ఎక్కువని తెలిపింది. దర్యాప్తు సంస్థలు పటిష్ఠ నిఘా ఉంచడం వల్ల ఈసారి చీరలు, ఆహార కిట్లు, ప్రెజర్ కుక్కర్లు, వంట పాత్రల వంటివి భారీగా దొరికాయని తెలిపింది. ఇప్పటి వరకు రూ.288 కోట్ల విలువైన వస్తువులను ఈడీ జప్తు చేసిందని ఈసీ వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఇప్పటి వరకు రూ.83.78 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. బీదర్ జిల్లాలో 100 కేజీల గంజాయి దొరికిందని వెల్లడించింది.
బెంగళూరు, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సోమవారం అర్ధరాత్రి గుల్బర్గా దక్షిణ నియోజక వర్గంలోని సంగమేశ్ నగర్లో డబ్బులు పంచుతున్న బీజేపీ కార్యకర్తలను కలబుర్గి డిప్యూటీ కమిషనర్ యశ్వంత్ గురుకర్ కారులో వెంబడించి పట్టుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు తృటిలో తప్పించుకున్నాడు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దత్తాత్రేయ పాటిల్ రేవూర్ ఈ ఘటనలో ప్రధాన నిందితుడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
రాష్ట్ర శాసనసభకు నేడు జరిగే ఎన్నికల్లో అవినీతి పరులకు ఓటేయవద్దని మంగళవారం స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ పిలుపు నిచ్చింది. ‘నలభై శాతం కమీషన్ పద్ధతి కొందరు కాంట్రాక్టర్లను బలి తీసుకుంది. ప్రజలు ఆత్మ సాక్షి ప్రకారం ఓటేస్తేనే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది.’ అని అసోసియేషన్ అధ్యక్షుడు కెంపణ్ణ తెలిపారు. ఇది పరోక్షంగా బీజేపీకి ఓటేయవద్దని చెప్పినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.