Lawrence Bishnoi | ఇప్పుడు ఎవరి నోట విన్నా కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం అతను పంజాబ్లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్కు వరుస హత్య బెదిరింపులు, బాబా సిద్ధిఖీ హత్య కేసు, జైల్లో ఉంటూనే టార్గెట్లను పూర్తి చేస్తుండటం వంటి కారణాలతో బిష్ణోయ్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.
ఈ నేపథ్యంలో మీషో (Meesho), ఫ్లిప్కార్ట్, టీషాపర్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లు (E – commerce platforms) గ్యాంగ్స్టర్ చిత్రాలతో కొన్ని టీషర్టులను (t shirts) విక్రయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయా ప్లాట్ ఫామ్లు లారెన్స్ బిష్ణోయ్ చిత్రాలతో కూడిన టీషర్ట్లను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నాయి. ఆ టీషర్ట్స్పై బిష్ణోయ్ను ‘గ్యాంగ్స్టర్’, ‘హీరో’ అంటూ పేర్కొనడం ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. మీషో సంస్థ ఈ టీషర్ట్స్ ధరను రూ.166 నుంచి రూ.177 తో విక్రయిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని సైజుల్లోనూ ఈ టీషర్ట్లను తమ సైట్లో అందుబాటులో ఉంచింది.
వీటిని చూసిన అలీషాన్ జాఫ్రీ అనే జర్నలిస్టు ఆ ఫొటోలను ఎక్స్ వేదికగా పోస్టు చేయడంతో.. ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ప్లాట్ఫామ్స్పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో మీషో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఆయా ఉత్పత్తులను వెబ్సైట్ నుంచి తొలగించేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ‘ఉత్పత్తులను వెబ్సైట్ నుంచి తొలగించేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నాం. మా వినియోగదారులందరికీ సురక్షితమైన, విశ్వసనీయమైన షాపింగ్ ప్లాట్ఫామ్ను అందించేందుకు మీషో కట్టుబడి ఉంది’ అంటూ మీషో ప్రతినిధి ఒకరు తెలిపారు.
కాగా, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరు తెరపైకి వచ్చింది. ఈ గ్యాంగ్ పనితీరు చర్చకు వచ్చింది. ఈ ముఠాలో ఎక్కువగా పేదలు, బాలలు, దారి తప్పిన యువకులు ఉంటారు. పోలీసుల కథనం ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో 700 మందికి పైగా షూటర్లు ఉంటారు. ఈ ముఠా స్థానిక గ్యాంగ్ స్టర్ల సాయంతో షూటర్లను అద్దెకు తీసుకొని వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి వారి చేత హత్యలు చేయిస్తూ వారికి బాగా డబ్బు ముట్టు చెప్తుంది.
గతంలో పంజాబ్కే పరిమితమైన లారెన్స్ ముఠా నేరాలు ప్రస్తుతం ఉత్తరాదిలోని 12 రాష్ర్టాలకు విస్తరించింది. కెనడా, పాకిస్థాన్, దుబాయ్, అమెరికా దేశాల్లోనూ ఈ ముఠాకు నెట్వర్క్ ఉంది. ఈ ముఠాకు ఖలీస్థాని ఉగ్రవాదులతోనూ, ఖలీస్థానీ వేర్పాటు వాద గ్రూపులతోనూ సంబంధాలు ఉన్నాయి. ఈ మఠాకు లాజిస్టిక్, న్యాయ వ్యవహారాలు, సమాచార సేకరణకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.
లారెన్స్ జైల్లో ఉన్నా మొబైల్ ఫోన్ సాయంతో ముఠా సభ్యులతో మాట్లాడుతుంటాడు. దేశ, విదేశాల్లోని తన అనుచరులతో కమ్యూనికేషన్ కోసం సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్లు కూడా వినియోగిస్తుంటాడు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా పంజాబీ గాయకులు, లిక్కర్ మాఫియా, డ్రగ్ ట్రాఫికర్లు, ప్రముఖ వ్యాపారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతుంది. దోపిడీలు, హత్యలు, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి నేరాల్లో ఈ గ్యాంగ్ ప్రమేయం క్రమంగా పెరుగుతూ వస్తున్నది.
2014లో లారెన్స్ మొదటిసారి అరెస్టయినప్పుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని నేపాల్ పారిపోయాడు. ఆ తర్వాత 2016లో అరస్టై అప్పటి నుంచి గుజరాత్లోని సబర్మతి జైల్లోనే ఉన్నాడు. 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిధూ మూసే వాలా హత్యతో లారెన్స్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాడు. లారెన్స్పై హత్య, దోపిడీ తదితర నేరాలకు సంబంధించి రెండు డజన్ల కేసులున్నాయి. నేరాలు చేయడంలో లారెన్స్ ముఠాకు, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు పోలికలున్నాయని పోలీసులు చెప్తారు. లారెన్స్ ముఠా కార్పొరేట్ కంపెనీ తరహాలో పనిచేస్తుందని తెలిపారు.
Also Read..
Unstoppable | జ్యోతిక లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. అన్స్టాపబుల్ షోలో సూర్య ఎమోషనల్
Samantha | బరువు పెరగండి అంటూ నెటిజన్ కామెంట్.. సీరియస్ అయిన సమంత
Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్కు మద్దతుగా.. తమిళనాడులో ప్రత్యేక పూజలు