DY Chandrachud | భారత ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన సరిగ్గా రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈయన తండ్రి వైవీ చంద్రచూడ్ (యశ్వంత్ విష్ణు చంద్రచూడ్) 16 వ సీజేఐగా పనిచేశారు. ఆయన 1978 ఫిబ్రవరి 22 నుంచి 1985 జూలై 11 వరకు దాదాపు 7 సంవత్సరాలపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. తండ్రి పదవీ విరమణ చేసిన 37 ఏండ్ల తర్వాత తనయుడు అదే పదవిలో కూర్చోవడం మన దేశ చరిత్రలో ఇదే తొలిసారి. తండ్రి తీసుకున్న రెండు నిర్ణయాలను తనయుడు తోసిపుచ్చి కొత్త చరిత్రను డీఐ చంద్రచూడ్ లిఖించారు.
తన తండ్రి వైవీ చంద్రచూడ్ 2017-18లో తీసుకున్న అడల్టరీ చట్టం, శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసుల్లో తీసుకున్న నిర్ణయాలను కుమారుడు డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు.
1. 1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తన తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. ‘వ్యభిచార చట్టం అనేది పితృస్వామ్య నియమం. లైంగిక స్వయంప్రతిపత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది.
2. 1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసులో, గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని పేర్కొన్నది. ఈ బెంచ్లో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఉన్నారు. కాగా, 2017 లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ బెంచ్లో డీవై చంద్రచూడ్ ఉన్నారు. ‘ఏడీఎం జబల్పూర్ కేసులో మెజారిటీ నిర్ణయంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని అంగీకరించడం ద్వారా భారతదేశ ప్రజలు తమ జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వానికి అప్పగించలేదు’ అని డీవై చంద్రచూడ్ తన నిర్ణయాన్ని రాశారు.
ఇప్పటివరకు సుప్రీంకోర్టు జస్టిస్గా డీవై చంద్రచూడ్ విలక్షణమైన తీర్పులనిచ్చారు. వీటిలో ముఖ్యంగా నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కేసు, కేరళకు చెందిన హదియా కేసు, అవివాహితల అబార్షన్ హక్కు కేసులను చెప్పుకోవచ్చు. తండ్రికి తగ్గ తనయుడిగా సుప్రీంకోర్టు జస్టిస్గా ఎంతో పరిణతి చెందిన తీర్పులను వెలువరించారు. సీజేఐగా ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటిని కూడా తన చతురత, తెలివితేటలతో నెగ్గుకువస్తారని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.