న్యూఢిల్లీ, జనవరి 18: హిందూ మహా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి మార్షల్ ఐల్యాండ్స్కు చెందిన ఏంవీ జెన్కో పికార్డీ అనే కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. నౌకలో తొమ్మిది మంది భారతీయులు సహా 22 మంది ఉద్యోగులున్నారు. దాడి సమాచారం అందుకున్న గంటలోపు ఐఎన్ఎస్ విశాఖపట్నం స్పందించి దాడి జరిగిన నౌకకు సాయం అందించి మంటలను అదుపులోకి తెచ్చింది. దీంతో నౌక తిరిగి ప్రయాణం మొదలు పెట్టింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవల తరచూ ఇజ్రాయెల్, అమెరికా నౌకలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.