నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లోనే కాదు మొత్తం దేశంలోనే ఆసక్తి రేపిన నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. మొదటి నుంచీ హోరాహోరీగా సాగిన ఈ ప్రక్రియలో మొదట 1200 ఓట్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలిచినట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడంతో ఇదే నిజమని భావించారు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే నందిగ్రామ్లో గెలిచింది మమత కాదు సువేందు అధికారి అని పలు ఇంగ్లిష్ సైట్లు వార్తలు ప్రచురించాయి. సువేందు 1956 ఓట్లతో గెలిచారనీ చెప్పాయి.
మరోవైపు మమతా బెనర్జీ కూడా నందిగ్రామ్ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఫలితం ఏమైనా.. 221 స్థానాలు గెలిచాం.. బీజేపీ ఓడిపోయింది.. అది చాలు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాననీ ప్రకటించారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని, అప్పుడే పుకార్లు పుట్టించొద్దని ట్వీట్ చేయడం గమనార్హం. టీఎంసీ ట్వీట్తో మరింత గందరగోళం నెలకొన్నది. దీనిపై ఎన్నికల సంఘం మాత్రం స్పందించలేదు.