Chief Justice DY Chandrachud | హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్రానికి, సుప్రీంకోర్టు మధ్య విభేదాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పనితీరు బేష్షుగ్గా ఉందన్నారు. ‘వ్యవస్థల్లో ఏదీ పరిపూర్ణం కాదు. కానీ అందుబాటులో ఉన్న కొలీజియం వ్యవస్థ ఉత్తమమైంది’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. శనివారం ఇండియా టూడే సదస్సులో ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలంటే బయటి వ్యక్తుల ప్రభావం నుంచి జ్యుడీషియరీని కాపాడాల్సి ఉందన్నారు. ‘ఏ వ్యవస్థ పరిపూర్ణం కాదు కానీ, మనం అభివృద్ధి చేసుకున్న వ్యవస్థ (కొలీజియం వ్యవస్థ) ఉత్తమమైంది. జ్యుడీషియరీ స్వతంత్రతను కాపాడాలి. ఇది ఎంతో ముఖ్యం. జ్యుడీషియరీ స్వతంత్రంగా ఉండాలనుకుంటే బయటి ప్రభావాల నుంచి జ్యుడీషియరీని కాపాడాలని మేం భావిస్తున్నాం’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు.
రాజ్యాంగ న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసులను ఆమోదించకపోవడానికి కేంద్రం చెబుతున్న కారణాలను సుప్రీంకోర్టు బయటపెడుతున్నది. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఒక అంశంపై భిన్నాభిప్రాయం ఉండటంలో తప్పేమిటి. ఇటువంటి భిన్నాభిప్రాయాలు రాజ్యాంగ రాజనీతిజ్ఞతను బలోపేతం చేస్తాయని భావిస్తున్నా. ఈ అంశాలపై కేంద్ర న్యాయశాఖ మంత్రితో చర్చలో పాల్గొనాలని నేను భావించడం లేదు’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగంతో విభేదిస్తున్నదని తరుచుగా న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వాదిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక వివిధ కేసులు ఎలా పరిష్కరించాలన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ‘జడ్జిగా 23 ఏండ్లుగా కొనసాగుతున్నా.. ఏ ఒక్క కేసు విషయంలోనైనా నేను ఎలా వ్యవహరించాలో ఏ ఒక్కరూ నాకు చెప్పలేదు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై ఇచ్చిన తీర్పు ఇందుకు రుజువు. జ్యుడీషియరీపై ఎటువంటి ఒత్తిడి లేదు’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం చేపట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.