Kejriwal | ప్రస్తుతంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిరక్షరాస్యులు నడుపుతున్నారని ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో `ఫేక్ డిగ్రీల`తో వచ్చే వారిని ఎన్నుకోవద్దని పరోక్షంగా ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్లోని శ్రీగగా నగర్ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ తాను పిల్లాడిగా ఉన్నప్పుడు భారత్ 20 ఏండ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని రాజకీయ నేతలు చెబుతుంటే విన్నానన్నారు. కానీ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం భారత్ అవుతుందని చెప్పడమూ విన్నానని చెప్పారు.
`మీ మాటలు మేం ఎలా విశ్వసించాలి. వారు (కేంద్రం) అబద్దాలే చెబుతారు. వారికేం తెలియదు. ఈనాడు కేంద్రంలో నిరక్షరాస్యులు పాలన సాగిస్తున్నారు` అని కేజ్రీవాల్ తెలిపారు. `ఒకవేళ కేంద్రంలో పాలన సాగిస్తున్నవారు అక్షరాస్యులైతే నోట్ల రద్దు, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకు రారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అక్షరాస్యులకు ఓటేయండి. ఫేక్ డిగ్రీలతో వస్తున్న నిరక్షరాస్యులకు ఓటేయకండి` అని పిలుపునిచ్చారు కేజ్రీవాల్.
తాను `అక్షరాస్యుడినని, ఇంజినీర్ని, ఐఆర్ఎస్ ఆఫీసర్గా పని చేసినందు` వల్లే కేంద్రంలో అధికారంలో బీజేపీ భయపడుతున్నట్లుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. వచ్చే పదేండ్లలోనే ప్రపంచంలోనే అగ్రదేశంగా భారత్ను నిలిపేందుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనతో రాజస్థాన్, దేశం పూర్తిగా లూటీ అయ్యాయని అన్నారు.