న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుతో బస్తీమే సవాల్ అన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాలు దువ్వుతున్నారు. దిగుమతి సుంకాలు చట్ట విరుద్ధమంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ట్రంప్ వైఖరి మారలేదు. ‘మీరిచ్చిన తీర్పు నన్నేమీ చేయలేదు’ అన్న తీరులో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చిన కొన్ని గంటల్లోనే పలు దేశాలపై 10 శాతం ప్రపంచ సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన ఆయన తాజాగా దాన్ని 15 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన ప్రకటించారు. ఆయా దేశాలపై 10 శాతం విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఓవల్ ఆఫీసులో ఇప్పుడే సంతకం చేశానని, ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ట్రూత్ సోషల్ పోస్ట్లో శుక్రవారం తెలిపారు.
వాణిజ్య చట్టం, 1974లోని సెక్షన్ 122 కింద 10 శాతం ప్రపంచ సుంకాన్ని విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఏమనుకున్నారో ఏమో 10 శాతం కాదు 15 శాతం పన్నులు విధిస్తున్నట్టు ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రకటించారు. ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లో దశాబ్దాలుగా అమెరికాను దోచుకున్నాయని తాను ఆరోపించిన దేశాలకు అధిక రేటు వర్తిస్తుందని ఆయన చెప్పారు. సుంకాలపై ఇటీవలి సుప్రీం కోర్టు నిర్ణయానికి ప్రతిస్పందనగా ఈ చర్యను రూపొందించినట్టు ఆయన తెలిపారు. రాబోయే నెలల్లో సుంకాలపై మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు ఆయన సూచించారు.
ట్రంప్ విధించిన అత్యవసర సుంకాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ భారత్కు ఎటువంటి మార్పులు ఉండబోవని ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. భారత్-అమెరికా ఇటీవల తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం గతంలో విధించిన 50 శాతం ప్రతీకార సుంకాలను తొలగించి దాని స్థానంలో 18 శాతం సుంకాలను భారత్పై విధించింది. అయితే, ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రతీకార సుంకాలను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేయడంతో భారతీయ వస్తువులపై విధించిన సుంకాలు రద్దయిపోయినట్లుగా భారత్ భావించింది. కాని ట్రంప్ తాజాగా భారత్తో సహా అన్ని దేశాలపై కొత్తగా 10 శాతం ప్రపంచ సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. సెక్షన్ 232(జాతీయ భద్రత), సెక్షన్ 301(అన్ఫేర్ ట్రేడ్) కింద ఈ సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు.
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఓ వార్తాసంస్థ అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ అందులో ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. వాళ్లు(భారత్) సుంకాలు చెల్లిస్తారు. మేము సుంకాలు చెల్లించం అని ట్రంప్ వివరించారు. ఇప్పటికే విధించిన తమ సాధారణ సుంకాలపైన అదనంగా 10 శాతం ప్రపంచ సుంకాన్ని విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వుపై సంతకం చేయనున్నానని ట్రంప్ వెల్లడించారు. మరొక ఉత్తర్వును అమలు చేసే వరకు కొత్తగా విధించిన 10 శాతం సుంకం అమల్లో ఉంటుందని వైట్హౌస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. అయితే భారత్పై మొత్తం ఎంత శాతం సుంకాలు విధిస్తారో ఇంకా స్పష్టత రాలేదు.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలను చట్టవిరుద్ధమని కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై భారత ప్రభుత్వం ప్రాథమికంగా స్పందించింది. వాటి పర్యవసానాల కోసం పరిణామాలను అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ శనివారం తెలిపింది.