ముంబై, ఫిబ్రవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో మౌలిక రంగానికి అత్యధికంగా నిధులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా ప్రారంభం నుంచి లాభాల బాటపట్టిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఒత్తిడికి గురైంది. చివర్లో మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరపడంతో మెటల్, రియల్టీ, సిమెంట్ రంగాలకు చెందిన షేర్లు ఇచ్చిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ తిరిగి కోలుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి 848.40 పాయింట్లు లేదా 1.46 శాతం లాభపడి 58,862.57 వద్ద ముగిసింది. 58,677 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఇంట్రాడేలో 59 వేల మార్క్ను తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 237 పాయింట్లు(1.37 శాతం) అందుకొని 17,576.85 వద్ద ముగిసింది.