ముంబై, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : కరోనా లేకపోయినా కరోనా పాజిటివ్ అని రిపోర్టు ఇచ్చి, రోగి అవయవాలను అపహరించడమే కాక, ఏకంగా శవాన్నే మాయం చేసిన అహల్యానగర్ నగరానికి చెందిన ఐదుగురు ప్రముఖ వైద్యులు, ఒక గుర్తు తెలియని ఉద్యోగిపై కేసు నమోదు చేయాలని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మృతుడి కుమారుడు అశోక్ బాబన్ రావ్ ఖోక్రలే ఫిర్యాదు మేరకు అహిల్యా నగర్లోని న్యూక్లియస్ హాస్పిటల్కు చెందిన వైద్యులు గోపాల్ బహురూపి, సుధీర్ బోరర్, సచిన్ పండులే, అక్షయ్ దీప్ జవారే, ముకుంద్ తాండలే, విఖే పాటిల్ మెమోరియల్ హాస్పిటల్ ల్యాబ్తో పాటు ఇతర ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశోక్ ఖోక్రాలే తండ్రి బాబన్ రావు (79)కు అనారోగ్యంగా ఉండటంతో 2020 ఆగస్టు 13న పాటియాలా హౌస్లోని డాక్టర్ పండులే కొవిడ్ 19 కేంద్రంలో చేర్చారు. మరుసటి రోజు అశోక్కు చెప్పకుండానే బాబన్ రావును డాక్టర్ బహురూపి, డాక్టర్ బోరర్లు న్యూక్లియస్ దవాఖానకు తరలించారు. అక్కడికి వెళ్లిన తర్వాత తండ్రిని చూడటానికి కుమారులను కూడా అనుమతించ లేదు. పైగా అతనికి కరోనా పాజిటివ్ అని చెప్పి డిశ్చార్జ్ చేయడానికి నిరాకరించారు.
ఆగస్టు 18న అతను చనిపోయినట్టు చెప్పిన దవాఖాన వారు రూ.1.84 లక్షలు బిల్లు చెల్లించమని కోరారు. బిల్లు చెల్లించిన తర్వాత మృతదేహాన్ని సివిల్ హాస్పిటల్కి పంపినట్టు చెప్పారు. అయితే, సివిల్ హాస్పిటల్, శ్మశాన వాటిక, న్యూక్లియస్ దవాఖానలో వెతికినా, నేటికీ తన తండ్రి మృతదేహం కనిపించలేదని ఫిర్యాదుదారుడు పేరొన్నాడు. తన తండ్రి అవయవాల కోసమే డాక్టర్లు ఈ దారుణానికి పాల్పడినట్టు పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో ఐదుగురు వైద్యులపై కేసు నమోదైంది.