(స్పెషల్ టాస్ బ్యూరో మస్తే తెలంగాణ) : ‘శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతోనే సుపరిపాలన సాధ్యం.. శాస్త్ర, పరిశోధనా రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం.. విజ్ఞాన రంగం లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు.. శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి..’ ఇవీ ఇటీవల ఓ వర్సిటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ మాటలు.. అయితే, అవి ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించాల్సిన కేంద్ర సర్కారే ఆయా రంగాల్లో ఇచ్చే అవార్డులను నిలిపివేసి శాస్త్రవేత్తలను నిరుత్సాహపరుస్తున్నది. పరిశోధనవైపు విద్యార్థులు ఉత్సాహం చూపకుండా చేస్తున్నది.
కొత్త అవార్డు ఇస్తామని చెబుతూ..
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ప్రతి ఏటా 301 ప్రతిష్టాత్మక అవార్డులను ఇస్తున్నది. ఆయా రంగాల్లో విశేష కృషి, నూతన ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అయితే, సైన్స్ పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభచూపిన శాస్త్రవేత్తకు నోబెల్ తరహాలో ‘విజ్ఞాన్త్న్ర’ అనే కొత్త అవార్డును ఇస్తామని చెబుతూ కేంద్ర సర్కారు 301 అవార్డులకు కత్తెర వేసింది. భారత శాస్త్ర రంగంలో అత్యున్నతమైనదిగా పరిగణిస్తున్న శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డునూ ఇంకా ప్రకటించలేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రతిభచూపిన శాస్త్రవేత్తకు ప్రతి ఏటా సెప్టెంబర్ 26న శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) ప్రకటిస్తుంది. దీనికోసం పరిశోధకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే, ఈ సారి సైంటిస్టులకు నిరాశే ఎదురైంది.
శాస్త్రవేత్తల అసంతృప్తి
సైన్స్ రంగంలోని పలు విభాగాల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో గత నెల హోం శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించారు. నోబెల్ తరహాలో ‘విజ్ఞాన్త్న్ర’ అవార్డును ప్రవేశపెట్టడంపై సమావేశంలో చర్చించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే, 300 సైన్స్ అవార్డులను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవార్డుల గౌరవం మరింత పెంచేలా ప్రధాని ఈ ప్రతిపాదనలు చేస్తున్నారని హోం శాఖ కార్యదర్శి ఏకే భల్లా చెప్పినా శాస్త్రవేత్తలు విశ్వసించడం లేదు. మానవ జాతి ప్రగతికి ఎంతో దోహదపడుతున్న శాస్త్ర పరిశోధనలను ఇది తీవ్రంగా నిరుత్సాహపరిచే చర్య అని వారు పేర్కొంటున్నారు.
అత్తెసరు నిధులతో పరిశోధనలెలా?
శాస్త్ర, పరిశోధనా రంగాన్ని అందరికీ చేరువ చేస్తామన్న మోదీ మాటలు బడ్జెట్ కేటాయింపుల్లో కనిపించడం లేదు. పరిశోధన రంగానికి గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కంటే 3.9 శాతం నిధులకు కోతపెట్టడమే ఇందుకు నిదర్శనం. 2013 ఆర్థిక సంవత్సరంలో రూ.20,017 కోట్లున్న కేటాయింపులు.. 2022-23 బడ్జెట్ కు వచ్చేసరికి రూ.14,794 కోట్లకు కుదించారు. 2013 తర్వాత ప్రతి యేటా ఈ రంగానికి కేటాయింపుల్లో కోతలు పెట్టడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ దేశాలు, అమెరికాతో పోల్చితే ఈ కేటాయింపులు ఏ మూల కు సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అత్తెసరు కేటాయింపుల వల్లే దేశంలోని అనేక మంది ప్రతిభావంతులు విదేశాలకు వెళ్లిపోతున్నారని అంటున్నారు.