న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం పార్లమెంట్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ మోదీ సర్కార్ ఆలోచనా విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ సర్కార్ విధానాలు పేదల వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలని దుయ్యబట్టారు. మోదీ సర్కార్ ఆలోచనా తీరుకు భీమా కొరేగావ్ కేసు ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు. నిరంకుశ వైఖరిని విడనాడి ప్రధాని మోదీ తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని విపక్షాలతో కలిసి పనిచేయాలని సభాధ్యక్షుడి ద్వారా కేంద్ర సర్కార్ను కోరుతున్నానని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాష్ర్టాల హక్కులను కాలరాయడంపై కేంద్రం వైఖరిని అంతకుముందు పెద్దల సభలో విపక్షాలు తూర్పారబట్టాయి. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యవసర ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.
రైతుల ఆదాయం రెట్టింపు, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానాన్ని విస్మరించారని ధ్వజమెత్తారు. రైల్వే ఉద్యోగాల్లో అవకతవకలు జరిగి యూపీ, బీహార్లో అభ్యర్థులు రోడ్లపైకి వచ్చారని గుర్తుచేశారు. ‘మీరు (కేంద్రప్రభుత్వం) పనిచేసేది తక్కువ. పబ్లిసిటీ క్కువ. ఒకటి తర్వాత ఒకటి అబద్దాలు చెప్పడం మీకు అలవాటుగా మారింది. మీ తప్పులను ఎవరైనా ఎత్తిచూపితే.. ఉన్నపళంగా మీకు మతం గుర్తొస్తుంది. హిందూత్వం ప్రమాదంలో పడిపోయిందంటూ గగ్గోలు పెడతారు. పెట్టుబడులు రాకపోవడంతో ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి. ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. మంచి రోజులు (అచ్ఛే దిన్) ఇంకా ఎప్పుడొస్తాయి?’ అని మల్లికార్జున్ ఖర్గే నిలదీశారు.
మోదీ హయాంలో ప్రస్తుతం దేశంలో రెండు భారత్లు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందులో ఒకటి ధనవంతులది కాగా, మరొకటి పేదలదని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ రెండు వర్గాల మధ్య రానురానూ అంతరం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్టాల గొంతుకలను నొక్కివేయడానికి న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్ స్పైవేర్లను కేంద్రం ఒక ఆయుధంగా వాడుకుంటున్నదని రాహుల్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని, అయితే మోదీ హయాంలో 23 కోట్ల మంది తిరిగి పేదరికంలోకి వెళ్లారని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం 50 ఏండ్ల గరిష్టానికి చేరిందన్నారు. అయితే రాహుల్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఆయన తల్లి ఇటాలియన్, తండ్రి భారతీయుడు కావడంతో ఆయనకు రెండు భారత్లు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేసింది.